రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో శతకం బాదాడు. తన టెస్టు కెరీర్లో ఇది మూడో సెంచరీ. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్టులో హాఫ్ సెంచరీ, రెండు టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.
ప్రత్యర్థి ఇంగ్లండ్కు జైస్వాల్ బజ్బాల్కు బదులుగా 'జైస్బాల్' రుచి చూపిస్తున్నాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే జైస్వాల్ తొలుత నిదానంగా ఆడాడు. ఆచితూచి బంతులను ఎదుర్కొంటూ పరుగులు తీశాడు. ఓ దశలో 73 బంతుల్లో జైస్వాల్ చేసిన పరుగులు 35 మాత్రమే. ఆ తర్వాత పూనకం వచ్చినట్లుగా జైస్వాల్ చెలరేగుతున్నాడు. అండర్సన్ బౌలింగ్లో 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లీ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి 78 బంతుల్లో అర్ధశతకం బాదాడు.

స్వీప్, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో జైస్వాల్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. బౌండరీతో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గాల్లో జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న రోహిత్ శర్మ 'కమాన్'అంటూ జైస్వాల్ సెంచరీని సంబరాలు చేసుకోవడం విశేషం. కాగా,ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 305 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. గిల్ (50*) క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. జో రూట్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఇవాళ ఆటలో మరో 112 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టారు.
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించడంతో ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం ఆట ప్రారంభమైన కాసేపటికీ జో రూట్ (18; 31 బంతుల్లో)ను బుమ్రా బోల్తాకొట్టించాడు. తర్వాత ఓవర్లోనే బెయిర్స్టో (0)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) కలిసి డకెట్ (153; 151 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డకెట్ 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు.
ఆ తర్వాత కుల్దీప్ డకౌట్ను ఔట్ చేసి ప్రత్యర్థిని మరోసారి దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా వికెట్లు తీసింది. సిరాజ్ వికెట్ల వేటకు ఇంగ్లండ్ చివరి నాలుగు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులు చేసింది.