రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) అదరగొట్టారు. 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి జైస్వాల్, అరంగేట్ర టెస్టులోనే వరుస హాఫ్ సెంచరీలు బాది సర్ఫరాజ్ పలు రికార్డులు బద్దలుకొట్టారు. వీరిద్దరు ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. సెకండ్ సెషన్లో 5.5 రన్రేటుతో పరుగుల వరద పారించారు.
టీ20 తరహాలో జైస్వాల్, సర్ఫరాజ్ సిక్సర్లు, బౌండరీలు మోత మోగించారు. అయిదో వికెట్కు 87 బంతుల్లో శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే వరకు క్రీజులో నిలబడి అభేద్యంగా 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్లో జైస్వాల్పై సర్ఫరాజ్ తన కోపాన్ని చూపించాడు.

94వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెహాన్ అహ్మద్ ఆ ఓవర్ బౌలింగ్ వేశాడు.అప్పటికీ జైస్వాల్ 196, సర్ఫరాజ్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే రెహాన్ వేసిన బంతిని సర్ఫరాజ్ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడ సులువుగా రెండు పరుగులు సాధించవచ్చు. కానీ జైస్వాల్ రెండో పరుగుకు రాలేదు. సర్ఫరాజ్ రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు పరిగెత్తినా నిరాకరించాడు. డబుల్ సెంచరీ త్వరగా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా స్ట్రైకింగ్ తానే కొనసాగించాడు.
దీంతో సర్ఫరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. అక్కడ సులువుగా రెండు పరుగులు వస్తాయని జైస్వాల్పై అరిచాడు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ వైఖరిని తప్పుపట్టాడు. తన ట్రేడ్మార్క్ ఎక్స్ప్రెషన్స్తో హిట్ మ్యాన్ సీరియస్ అయ్యాడు.
కాగా, ఓవర్నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కుల్దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో) తప్పిదంతో శుభ్మన్ గిల్ (91; 154 బంతుల్లో) సెంచరీ కోల్పోయాడు. కుల్దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ రనౌటయ్యాడు. రోహిత్ శర్మ (19) పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్లీ తలో వికెట్ తీశారు.
అనంతరం 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెన్ డకెట్ (4; 15 బంతుల్లో), జాక్ క్రాలే (11; 26 బంతుల్లో), ఒలీ పోప్ (3; 14 బంతుల్లో), జానీ బెయిర్స్టో (4; 3 బంతుల్లో), జో రూట్ (7; 40 బంతుల్లో), బెన్ స్టోక్స్ (15; 39 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (0) వరుసగా పెవిలియన్కు చేరారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.