టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా మూడు సెంచరీలు సాధించిన ఏడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 13 ఇన్నింగ్స్లో జైస్వాల్ మూడు శతకాలు బాదాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్తో పాటు జైస్వాల్ ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
రికార్డుల్లో దిగ్గజ ఓపెనర్ సెహ్వాగ్తో జైస్వాల్ పోటీపడుతున్నాడు. 13 ఇన్నింగ్స్ల గణాంకాల్లో సెహ్వాగ్ కంటే మెరుగైన సగటును జైస్వాల్ కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ 13 ఇన్నింగ్స్ల్లో 53 సగటుతో 66 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తే జైస్వాల్ 62 సగటుతో 65 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. కాగా, రాజ్కోట్ టెస్టులో 133 బంతుల్లో 104 పరుగులు సాధించిన జైస్వాల్ రిటైర్ హర్ట్గా మైదానాన్ని వీడాడు.

అయితే జైస్వాల్ తొలుత నిదానంగా ఆడాడు. ఆచితూచి బంతులను ఎదుర్కొంటూ పరుగులు తీశాడు. ఓ దశలో 73 బంతుల్లో జైస్వాల్ చేసిన పరుగులు 35 మాత్రమే. ఆ తర్వాత పూనకం వచ్చినట్లుగా జైస్వాల్ చెలరేగిపోయాడు. అండర్సన్ బౌలింగ్లో 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లీ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి 78 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. స్వీప్, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో జైస్వాల్ బౌండరీల మోత మోగిస్తూ 122 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.
మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. గిల్ (65*)తో పాటు కుల్దీప్ (3*) క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. రజత్ పటిదార్ డకౌటయ్యాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఇవాళ ఆటలో మరో 112 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించడంతో ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యం లభించింది.
డకెట్ (153; 151 బంతుల్లో), బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) రాణించారు. కాగా, ఇంగ్లండ్ చివరి నాలుగు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులు చేసింది.