IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఐదో, చివరి మ్యాచ్ లండన్లోని చారిత్రాత్మక కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్కు వర్షం తరచుగా అడ్డుపడుతూ ఆటగాళ్లకు, అభిమానులకు నిరాశను కలిగించింది. ఈ వాతావరణం ఇంగ్లండ్ జట్టుకు అనుకూలంగా మారగా.. భారత జట్టుకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించింది. మొదటి సెషన్ ముగిసినప్పటి నుంచే వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తగిన సమయం దొరకలేదు.
ముఖ్యంగా భారత బ్యాటర్లు ఆడుతున్నప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల బౌలర్లకు లభించిన అనూహ్య సహకారం ఇంగ్లండ్ జట్టుకు బాగా కలిసొచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి కేవలం 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున కరుణ్ నాయర్ 52 పరుగులతో అజేయంగా క్రీజులో నిలబడగా.. అభిమానుల దృష్టి ఇప్పుడు రెండో రోజు వాతావరణంపైనే ఉంది. వర్షం మళ్లీ మ్యాచ్ను ఆటాడుకుంటుందా అని ఆందోళన నెలకొంది.

వాతావరణ నివేదిక.. ఆశలు రేపుతున్న అంచనాలు
కెన్నింగ్టన్ ఓవల్లో చివరి టెస్ట్ మొదటి రోజు వర్షం పడే అవకాశం 96 శాతం ఉండగా.. నేడు(రెండో రోజు) ఈ అవకాశం గణనీయంగా తగ్గి 46 శాతానికి చేరింది. ఇది క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా భారత జట్టుకు శుభవార్త అని చెప్పొచ్చు. ఈ అంచనాల ప్రకారం.. మ్యాచ్ రెండో రోజు దాదాపు పూర్తి 90 ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానిక సమయం ప్రకారం.. మ్యాచ్ ఉదయం 11 గంటలకు(ఇండియా ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. స్వల్ప వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొద్దిపాటి సమయం మినహా, మిగతా వాతావరణం అంతా స్పష్టంగా, అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో తమ ప్రదర్శనను కనబరచడానికి అవకాశం కల్పిస్తుంది.
తొలి ఇన్నింగ్స్లో ఎంత స్కోరు చేస్తే బెటర్?
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి బలహీనమైన స్థితిలో ఉంది. క్రీజులో అజేయంగా కరుణ్ నాయర్తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరు భారత జట్టుకు దాదాపు చివరి గుర్తింపు పొందిన బ్యాటింగ్ జోడి అని చెప్పొచ్చు. వీరి తర్వాత ఆకాష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ వంటి టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు, వీరి నుంచి భారీ పరుగులు ఆశించడం కష్టం. ప్రస్తుతం కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ ఇద్దరు బ్యాటర్లు నేడు రెండో రోజు కనీసం మరో 100 పరుగులు జోడించగలిగితే, భారత్ ఒక మంచి స్థితికి చేరుకుంటుంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఎలాగైనా 300 పరుగుల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కోరు ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ పరిస్థితులూ భారత్ బౌలర్లకు అనుకూలిస్తే, ఇంగ్లాండ్ను కట్టడి చేయడానికి ఒక పటిష్టమైన పునాది అవుతుంది. వాతావరణం సహకరిస్తే, రెండో రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం.