IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ గురువారం లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్లో వర్షం భారత జట్టుకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సిరీస్ను సమం చేయడానికి భారత జట్టుకు ఇదే చివరి అవకాశం కావడంతో ఈ మ్యాచ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ను శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా,వాషింగ్టన్ సుందర్ అద్భుత శతకాల సహాయంతో భారత జట్టు పోరాడి డ్రా చేసుకోగలిగింది.
లండన్ వాతావరణం.. భారత ఆశలపై నీళ్లు?
ఓవల్ మైదానంలో జరగనున్న ఐదో టెస్టును భారత జట్టు గెలిచి తీరాలనే పరిస్థితిలో ఉంది. ఈ కీలక సమయంలో వాతావరణ నివేదిక భారత జట్టు లక్ష్యానికి ప్రతికూలంగా మారింది. ఈ రోజు మ్యాచ్ మొదటి రోజు ఆట ప్రారంభానికి ముందు, ఆట సమయంలో లండన్లో భారీ వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉందని ఇంగ్లండ్ వాతావరణ పరిశోధనా కేంద్రం తెలియజేసింది. అంతే కాకుండా పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని "ఎల్లో అలర్ట్" కూడా జారీ చేయబడింది. దీని కారణంగా టాస్ ఆలస్యం కావడానికి, మొదటి రోజు ఆట వర్షం వల్ల తీవ్రంగా ప్రభావితం కావడానికి అధిక అవకాశాలు ఉన్నాయి.

పగటిపూట వర్షం కురిసే అవకాశం 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుందని.. ఆట చివరి సమయంలో మాత్రమే వాతావరణం కొంత మెరుగుపడవచ్చని అంచనా వేయబడింది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మధ్యాహ్నం కూడా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది టీమిండియా గేమ్ ప్లాన్ను దెబ్బతీసే అవకాశం ఉంది.
ఈ సిరీస్ ను 2-2తో సమం చేయడానికి భారత జట్టుకు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. అయితే వాతావరణం మొదటిరోజు ఆటకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఇంగ్లండ్, భారత జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో,లైవ్ స్ట్రీమింగ్ను జియో హాట్స్టార్లో అభిమానులు చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం టాస్ మధ్యాహ్నం 3:00 గంటలకు, ఆట మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్కు ఆటంకం కలిగితే, అభిమానుల నిరీక్షణ మరింత పెరిగే అవకాశం ఉంది.