టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ కొనియాడాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు సాధించిన అశ్విన్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అయిదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
''ఇంగ్లండ్ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ సత్తాచాటలేకపోతున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. కానీ ఈ మ్యాచ్ చూసిన తర్వాత దిగ్గజ క్రికెటర్ను తక్కువగా అంచనా వేశామని గ్రహించి ఉంటారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జో రూట్ తానేంటో నిరూపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ అశ్విన్ అదరగొట్టాడు''

''రెండో ఇన్నింగ్స్లో రోహిత్ కొత్త బంతిని అశ్విన్కు అందించాడు. ఆ క్షణంలో అతని కళ్లలో కసి కనిపించింది. ఈ సిరీస్లో తన క్లాస్ ముద్రణ వేయాలని సంకల్పంతో ఉన్నట్లు కనిపించాడు. రోహిత్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో చాలా ఆలస్యంగా అశ్విన్ను బౌలింగ్కు ఇచ్చారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అశ్విన్తో బౌలింగ్ ప్రారంభించాడు'' అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు.
మూడో టెస్టులో 500 వికెట్ల మార్క్ను అందుకున్న అశ్విన్ రాజ్కోట్ టెస్టులో మరో ఘనత సాధించాడు. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే (350) పేరిట ఉండేది. కాగా, ఇంగ్లండ్తో మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న అయిదో టెస్టు అశ్విన్కు చాలా స్పెషల్ కానుంది. ఇప్పటివరకు తన కెరీర్లో యాష్ 99 టెస్టులు ఆడాడు. ధర్మశాల టెస్టుతో సెంచరీ సాధించనున్నాడు.
ఈ స్పెషల్ టెస్టులో భారత క్రికెట్కు చేసిన సేవలకు గుర్తుగా అశ్విన్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆఖరి టెస్టులో విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు నడిపిస్తాడా లేదా అశ్విన్కు అవకాశం ఇస్తారా చూడాలి.