రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. విజయానికి టీమిండియాకు 74 పరుగులు, ఇంగ్లండ్కు ఏడు వికెట్లు అవసరం. ఈ సమీకరణాన్ని చూస్తే భారత్ ఫేవరేట్గానే కనిపిస్తోంది. కానీ రాంచీ వికెట్ అంత సులువుగాలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్లు గిరగిర తిరిగే బంతుల్ని సంధిస్తూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో విజయానికి తక్కువ పరుగులు అవసరమైనప్పటికీ భారత అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.
అయితే ఓ స్థితిలో టీమిండియా 84/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇవాళ ఆటలో జో రూట్ తొలి బంతిని ఎదుర్కొన్న యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) ఔటయ్యాడు. అండర్సన్ అద్భుత క్యాచ్తో వెనుదిరిగాడు.

అనంతరం టామ్ హర్ట్లీ వేసిన బంతిని రోహిత్ శర్మ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. క్రీజును వదిలి ముందుకు వచ్చి డిఫెండ్కు ప్రయత్నించాడు. కానీ బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. ఒకవేళ బ్యాటుకు ఎడ్జ్ తీసుకోకపోయినా రోహిత్ ఔటయ్యేవాడు. క్రీజును దాటిన రోహిత్ను ఫోక్స్ స్టంపౌట్ కూడా చేశాడు.
అయినప్పటికీ ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ చేసిన పరుగులతో భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రజత్ పటిదార్ షోయబ్ బషీర్ వేసిన వలలో చిక్కుకున్నాడు. డిఫెండ్కు ట్రై చేసి ఒలీ పోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రజత్ ఔటవ్వడంతో ఫేవరేట్లో ఉన్న భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది. ఆత్మరక్షణలోకి వెళ్లింది. శుభ్మన్ గిల్ (18*; 62 బంతుల్లో), రవీంద్ర జడేజా (3*; 29 బంతుల్లో) పరుగుల మీద కంటే వికెట్ కాపాడుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రజత్ పటిదార్ వికెట్తో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా వ్యాఖ్యానించాడు.
మరోవైపు రజత్ పటిదార్ తన ఆరు ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన రజత్ (33, 9 పరుగులు) రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెహాన్ అహ్మద్ బౌలింగ్ వెనుదిరిగాడు. అలాగే రాజ్కోట్ టెస్టులో (5, డకౌట్) టామ్ హర్ట్లీ బౌలింగ్లో, ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో (17, 0) షోయబ్ బషీర్ బౌలింగ్లో పెవిలియన్కు చేర్చాడు.