రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 110 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 40/0తో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం 16 ఓవర్లకు 82/0 స్కోరు సాధించింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (45; 55 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (37; 41 బంతుల్లో) ఉన్నారు.
అంతకుముందు అశ్విన్ (5/51), కుల్దీప్ యాదవ్ (4/22) ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే జో రూట్ ఔటైన తీరును కారణంగా చూపిస్తూ ఇంగ్లండ్ మాజీ మైకేల్ వాన్ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాడు. డీఆర్ఎస్ ఆపరేటర్లను సీసీ కెమెరాల నిఘాలో ఉంచాలని అన్నాడు.

ప్రస్తుత భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో హాక్-ఐ సరిగా పనిచేయట్లేదని ఆరోపించాడు. అశ్విన్ బౌలింగ్లో జో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో కూడా రూట్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అని తేలింది. ఈ నిర్ణయం ఇంగ్లండ్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఆపరేటర్లపై ఆరోపిస్తూ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''మోసం చేస్తున్నారని నేను అనట్లేదు. కానీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇక్కడ నిర్ణయాలతో మనం విభేదిస్తున్నాం. హాక్ఐ సాంకేతికతపై పనిచేసే వ్యక్తుల మీద నిఘూ ఉంచితే బాగుంటుంది. ప్రస్తుత సిరీస్లో హాక్ఐ గొప్పగా లేదు. ఇక్కడ ఆపరేటర్లు చాలా కీలకం. వాళ్ల ఏ విధంగా పని చేస్తున్నారు? నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? అని తెలియడం కోసం కెమెరాలు ఏర్పాటు చేయాలి''

''పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నా. ఐసీసీ నియమించిన వారిపై అయినా సరే ఇదే చేయాలి. ఆపరేటింగ్ చేసేవాళ్లు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ అంపైర్లు కంటే టెక్నాలజీని ఆపరేట్ చేసే వాళ్లే కీలకం. ఇక అంపైర్ కాల్ గురించి మాట్లాడాలంటే.. దాన్ని తొలిగించాలనుకుంటున్నా. ఇరు జట్ల ఈ నిర్ణయాలపై విసుగు చెందుతున్నాయని తెలుసు'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అంపైర్ కాల్ నిర్ణయంతో టీమిండియా నలుగురు బ్యాటర్లను కోల్పోయింది. గతంలో ఇంతమంది బ్యాటర్లు అంపైర్ కాల్తో ఔటవ్వడం జరగలేదు. అయితే రాజ్కోట్ టెస్టులో ఓటమి తర్వాత అంపైర్కాల్ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తప్పుబట్టాడు. కానీ ప్రస్తుత టెస్టులో ఎంతో లాభపడ్డాడు.