యువ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ను భారత జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. రాజ్కోట్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ టాస్ పడిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రంజీ ట్రోఫీలో అతడు బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు ముకేశ్ తిరిగి టీమిండియాతో చేరతాడని వివరించింది.
''రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరగుతున్న మూడో టెస్టు భారత జట్టు నుంచి ముకేశ్ కుమార్ను విడుదల చేస్తున్నాం. రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. అయితే తర్వాత జరగనున్న రాంచీ టెస్టుకు అతడు తిరిగి టీమిండియాలో చేరుతాడు'' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. రెండో టెస్టు పడిన కాసేపటికే మహ్మద్ సిరాజ్ను కూడా జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే సిరాజ్ విషయంలో పనిభారాన్ని పరిగణించి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపింది. కానీ ముకేశ్ కుమార్ను రంజీ ట్రోఫీలో పాల్గొనమని విడుదల చేసింది. వైజాగ్ టెస్టులో ఆడిన ముకేశ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లు వేసిన అతడు 44 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో అయిదు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీసి ఫర్వాలేదనిపించాడు.
ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో పాటు ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ను పేసర్లుగా ఎంపికయ్యారు. కాగా, రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియా పైచేయి సాధిస్తుంది. 33 పరుగులకే మూడు వికెట్లు పడి కష్టాల్లో ఉన్న జట్టును రోహిత్ శర్మ (106*), రవీంద్ర జడేజా (69*) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యమైన 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ శతకాన్ని, జడేజా అర్ధశతకాన్ని సాధించారు.
యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్మన్ గిల్ ( డకౌట్; 9 బంతుల్లో), రజత్ పటిదార్ (5; 15 బంతుల్లో) చెత్తషాట్లు ఆడి వికెట్లు చేజార్చుకున్నారు. కాగా, సెంచరీ సాధించిన రోహిత్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు సాధించిన అయిదో బ్యాటర్గా హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. సునీల్ గవాస్కర్ (4), విజయ్ మెర్చంట్ (3), మురళీ విజయ్ (3), కేఎల్ రాహుల్ (3), రోహిత్ (3 సెంచరీలు) బాదారు.