రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న మూడో టెస్టుపై భారత్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్పై 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (104; 133 బంతుల్లో) సెంచరీ సాధించాడు. క్రీజులో శుభ్మన్ గిల్ (65; 120 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (3; 15 బంతుల్లో) ఉన్నారు. రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో), రజత్ పటిదార్ (డకౌట్; 10 బంతుల్లో) నిరాశపరిచారు.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 455 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. అయితే 224/2తో ఓ స్థితిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ 95 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు కోల్పోవడానికి కారణం హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనే. బ్యాటర్లను బెంబేలెత్తించే యార్కర్లు సిరాజ్ సంధిస్తూ వికెట్ల వేట సృష్టించాడు. ఇంగ్లండ్ జట్టులో డకెట్ (153; 151 బంతుల్లో), బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) రాణించారు. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు.

శనివారం ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడాడు. అత్యవసర కారణాలతో రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టు నుంచి తప్పుకోవడంతో మిగిలిన తమ నలుగురు బౌలర్లపై బాధ్యత మరింత పెరిగిందని సిరాజ్ పేర్కొన్నాడు. తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అశ్విన్ జట్టును వీడిన సంగతి తెలిసిందే. ''అశ్విన్ దూరమవ్వడంతో జట్టులో నలుగురు బౌలర్లు మాత్రమే ఉన్నాం. మాపై బాధ్యత మరింత పెరిగింది. ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతూ ఎదురుదాడికి దిగుతారని మాకు తెలుసు. ఈ క్రమంలో వాళ్లు తప్పు చేస్తారని భావించాం. దాని కోసం కలిసికట్టుగా ఎదురుచూశాం''
''ప్రత్యర్థి వికెట్లు తీయడానికి యార్కర్లు మంచి అస్త్రాలు. ఇక వరుసగా ఆరు డాట్ బాల్స్ వేయడం బౌలర్ల ప్రధాన పాత్ర. ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరు బంతుల్ని వరుసగా డాట్ బాల్గా ముగించడానికి ఇష్టపడరు. అది మాకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమైనప్పుడు ఆ సమయాన్ని ఫ్యామిలితో గడిపాను. ప్రాక్టీస్ కూడా చేశాను. అంతేగాక ఇంట్లో ఉంటూ మ్యాచ్ను కూడా చూశాను. బుమ్రా వేసిన యార్కర్లను ఆస్వాదించాను'' అని సిరాజ్ అన్నాడు.
అయితే ఇదంతా సిరాజ్ హిందీలో మాట్లాడాడు. ఈ హైదరాబాదీ పేసర్ మాట్లాడిన వ్యాఖ్యలను దినేశ్ కార్తీక్ ట్రాన్సలేటర్గా ఇంగ్లిష్లో తెలియజేశాడు. అనంతరం ఆఖర్లో సిరాజ్ మాట్లాడుతూ.. 'ట్రాన్స్లేట్ చేసినందుకు థ్యాంక్స్ డీకే భాయ్. ఇక ఆర్సీబీలో కలుద్దాం' అని నవ్వుతూ ముగించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున దినేశ్ కార్తీక్, సిరాజ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-2024 సీజన్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మార్చి చివరి వారంలో లీగ్ ప్రారంభించే అవకాశం ఉంది.