స్టార్ క్రికెటర్ను విరాట్ కోహ్లిని భారత్ అభిమానులే కాదు, ఇంగ్లండ్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు కూడా చాలా మిస్ అవుతున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లి మూడు, నాలుగు టెస్టులకు కూడా దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక చివరి టెస్టుకు కూడా అతడు అందుబాటులో ఉండడని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కోహ్లి గురించి మాట్లాడాడు.
విరాట్ కోహ్లి జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు తీరని లోటు అని నాజర్ అభిప్రాయపడ్డాడు. కానీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదేనాని పేర్కొన్నాడు. ''అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఒకరు. ఏ సిరీస్ అయినా, ఏ జట్టే అయినా అతడు లేకపోతే తీరని లోటే. క్రికెట్ కూడా కోహ్లి గురించి ఆలోచించాలి. గత 15 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. కాస్త విరామం తీసుకుని కుటుంబంతో గడపాలనుకుంటే తప్పేమి లేదు. కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి''

''ఈ నిర్ణయం భారత్కు పెద్ద ఎదురు దెబ్బ. అయితే టీమిండియాలో యువ బ్యాటర్లు ఉన్నారు. గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ కూడా అన్నిఫార్మాట్లలో గొప్పగా ఆడుతున్నాడు. రాహుల్ తిరిగొస్తాడని భావిస్తున్నా. కానీ టెస్టు సిరీస్లో కోహ్లి X అండర్సన్ మధ్య సాగే ఆసక్తికరమైన పోటీనీ మనం మిస్ అవుతాం'' అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్ వైజాగ్ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం కోహ్లి హైదరాబాద్కు వచ్చి జట్టుతో చేరాడు. కానీ అదే రోజు రాత్రి వ్యక్తిగత కారణాలతో తిరిగి ఇంటికి పయనమయ్యాడు. కోహ్లి గైర్హాజరీకి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో దూరమయ్యాడనే కథనాలు వస్తున్నాయి. మరోవైపు కోహ్లి స్థానంలో రజత్ పటిదార్ను జట్టులో ఎంపిక చేశారు. రెండో టెస్టులో తుదిజట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రజత్ సత్తాచాటలేకపోయాడు.
కోహ్లి మూడు, నాలుగు టెస్టులకు కూడా దూరమైతే రజత్ పటిదార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో స్థానం కోసం పోటీపడతారు. కాగా, చివరి మూడు టెస్టులకు టీమిండియాను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో పేర్కొంటున్నారు.