కోహ్లీ వద్ద సమాధానమే లేదు:
నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మార్క్ వుడ్ టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఔట్ చేశాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన చేతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీలు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. జిమ్మీ వేసే ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ బంతులకు పుజారా, కోహ్లీల వద్ద సమాధానం లేకుండా పోయింది. భారత ఆటగాళ్లు ఇద్దరూ డిఫెన్స్ చేస్తూ.. వికెట్ కాపాడుకున్నారు. దీంతో పరుగులు రావడం గగనంగా మారింది.

ఏమాత్రం తగట్లేదుగా:
చేతేశ్వర్ పుజారా బ్యాటింగ్ చేస్తుండగా.. విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేసి కోహ్లీని దాటుతుండగా.. ఇంగ్లండ్ పేసర్పై స్లెడ్జింగ్కు దిగాడు టీమిండియా కెప్టెన్. 'బాప్రే.. ఈ వయసులోనూ ఏమాత్రం తగట్లేదుగా!. సూపర్ బౌలింగ్' అంటూ సరదాగా అన్నాడు. కోహ్లీ అలా అంటున్నా.. అండర్సన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. మౌనంగా తనపని తాను చేసుకుపోయాడు జిమ్మీ. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అండర్సన్ ఏకాగ్రతని చెదరగొట్టేందుకు కోహ్లీ ప్రయత్నించాడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బుమ్రాపై ఫైర్:
అంతకుముందు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై జేమ్స్ అండర్సన్ మండిపడ్డాడు. 11వ నంబర్ బ్యాట్స్మన్గా అండర్సన్ క్రీజులోకి రాగానే.. బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. ఓ బంతి హెల్మెట్కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ కన్కషన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్ను మొహ్మద్ షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ఆటగాళ్లంతా మైదానం వీడుతుండగా.. అండర్సన్ దగ్గరకు వెళ్లిన బుమ్రా అతని భుజం తడుతూ ఓ నవ్వు నవ్వాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అండర్సన్.. బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

20 పరుగులకే ఔట్:
విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలోనూ విఫలమవుతున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్లో ఆడే అవకాశం రాలేదు. లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసినా.. కీలక సమయంలో ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో మళ్లీ నిరాశపరిచాడు. నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్నట్టు కనిపించినా.. 20 పరుగులకే పెవిలియన్ చేరాడు. కోహ్లీ మరోసారి విఫలమవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీపై ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications












