
లండన్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఈరోజు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులు చేసింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆల్రౌండర్ సామ్ కరన్ స్థానంలో బ్యాట్స్మన్ ఒలీ పోప్, ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ వచ్చారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో రెండు మార్పులు చేశాడు. సీనియర్ పేసర్లు ఇశాంత్ శర్మ, మొహ్మద్ షమీ స్థానాల్లో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ ఉమేశ్ యాదవ్లు జట్టులోకి వచ్చారు. దాంతో జట్టులో చోటు ఆశించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి బౌండరీ బాదడంతో అంతర్జాతీయ క్రికెట్లో 23వేల పరుగులను పూర్తిచేశాడు. అంతేకాదు 23వేల పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ ఇప్పటివరకు 440 మ్యాచ్ల్లో 490 ఇన్నింగ్స్లలో 23 వేల పరుగులు చేశాడు. అతని సగటు 55.28గా ఉంది. కోహ్లీ 70 సెంచరీలు మరియు 116 అర్ధ సెంచరీలు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్లలో 23వేల పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ 23000 పరుగులు పూర్తి చేయడానికి 544 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు 551 ఇన్నింగ్స్లో ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ సిరీస్కు ముందు 23000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీకి 125 పరుగులు అవసరం. ఇప్పటివరకు అతను ఈ సిరీస్లో ఐదు ఇన్నింగ్స్లలో 124 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 23వేల పరుగులను పూర్తిచేశాడు.
పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో మూడు వికెట్లు తీస్తే టెస్ట్ ఫార్మాట్లో వంద వికెట్లు తీసిన ఘనతను అందుకుంటాడు. టెస్టుల్లో 22 మంది భారత బౌలర్లు 100 వికెట్లకు పైగా తీశారు. 619 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్ అశ్విన్ (413), రవీంద్ర జడేజా (223), ఉమేష్ యాదవ్ (148), ఇషాంత్ శర్మ (311)లు తీశారు. టెస్టుల్లో హర్భజన్ సింగ్ (417) ఫీట్కు రవిచంద్రన్ అశ్విన్ (413) ఇంకా నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఓవల్ మైదానంలో 1971 తర్వాత ఇంగ్లండ్పై భారత్ మళ్లీ విజయం సాధించలేదు. ఆ తర్వాత ఐదు టెస్టులు డ్రా కాగా, మూడింటిలో భారత్ ఓటమిపాలైంది.
టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(11) ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి అతడు పెవిలియన్ చేరాడు. బంతి బ్యాట్ అంచులకు తాకుతూ వెళ్లగా కీపర్ జానీ బయిరిస్టో క్యాచ్ అందుకున్నాడు. దాంతో భారత్ 28 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓలి రాబిన్సన్ వేసిన 11.6 ఓవర్కు బంతి లోకేష్ రాహుల్ కాలికి తాకడంతో ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లింది. అక్కడ వికెట్లకంటే పైకి వెళ్లేలా తేలడంతో రాహుల్ నాటౌట్గా నిలిచాడు. అయితే రాబిన్సన్ వేసిన 13.5 ఓవర్కు రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 28 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ఉన్నారు.