
లండన్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో తాము డ్రా కోసం ఎక్కడా ప్రయత్నించలేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. చివరి రోజు పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని, అదే విధంగా గెలిచామన్నాడు. రూట్ సేనపై గెలిచిన రెండు మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు పట్టుదల చూపించారని ప్రశంసించాడు. జట్టులోని ముగ్గురు టాప్ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్గాను తాను ఎంతో సంబరపడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఐదవ రోజైన సోమవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్ విజయానికి 10 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 291 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చివరికి రూట్ సేన 210 పరుగులకు ఆలౌటై మ్యాచ్లో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించినా చివరికి ఆతిథ్య జట్టు ఓటమి పరాభవం చెందడం విశేషం.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. 'మేం గెలిచిన రెండు మ్యాచ్ల్లో ఆటగాళ్లు పట్టుదల చూపించారు. అందరూ గెలవాలనే కసితో ఆడారు. ఈ మ్యాచ్లో మేం డ్రా కోసం ప్రయత్నించలేదు. గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ఆటగాళ్ల సమిష్టి కృషి, పట్టుదలకు చాలా గర్వపడుతున్నా. జట్టులోని ముగ్గురు టాప్ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్గాను ఎంతో సొంతోషపడుతున్నా. ఇక ఈ మ్యాచ్లో వాతావరణం వేడిగా ఉండటంతో మేం గెలిచే అవకాశం ఉందని ముందే అనుకున్నాం. ఈ క్రమంలోనే బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, జడేజా బంతితో మాయచేశారు. ముఖ్యంగా బంతి రివర్స్ స్వింగ్కు అనుకూలంగా ఉందని తెలియగానే బుమ్రా బంతి ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి బంతి ఇవ్వగానే రెండు కీలక వికెట్లు తీశాడు. ఉమేష్ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తమ పాత్ర పోషించాడు' అని అన్నాడు.
'రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా శార్దూల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆకట్టుకున్నాడు. అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడి రెండు అర్ధ శతకాలు రూట్ సేనను దెబ్బతీశాయి. బంతితోనూ రాణించాడు. అయితే ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కోచ్ రవిశాస్త్రి, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. అయినా ఈ విజయాన్ని చూసి ఐసోలేషన్లో ఉన్న వాళ్లంతా సంతోషిస్తారు. ఈ గెలుపు రాబోయే మ్యాచ్లో మాకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇక మా గురించి బయట ఎవరేమునుకున్నా పట్టించుకోం. ఏ నిర్ణయమైనా జట్టంతా కలిసే తీసుకుంటాం' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో 157 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 210 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. భారత్ ఓవల్లో 50 ఏళ్ల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. 1971లో ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లిన భారత్.. ఓవల్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ 50 ఏళ్లలో అక్కడ 8 టెస్టులాడిన భారత్.. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా గెలుపొందలేకపోయింది. కానీ తాజాగా ఆ సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ కోహ్లీసేన అద్భుతం చేసింది.