న్యూ ఢిల్లీ: విరాట్ కోహ్లీ ఆటలోని సాధికారతను మరెవ్వరిలోనూ చూడలేదని టీమిండియా మాజీ ఆటగాడు మోహిందర్ అమర్నాథ్ అన్నారు. నాటింగ్హామ్లో భారత జట్టు తిరుగులేని ప్రదర్శన చేసిందన్నారు. ఆ విజయంలో కోహ్లీదే కీలక పాత్ర అని ప్రశంసించారు. అతడిని వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్తో పోల్చారు.
'పరీక్ష పెట్టే పరిస్థితులను అర్థం చేసుకొని నిలవడం విరాట్లోని గొప్పదనం. ప్రపంచంలోని మిగతా పిచ్లపై ఆడటానికి ఇంగ్లాండ్లో ఆడటానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాకు తగ్గట్టుగానే విరాట్ తన టెక్నిక్ను మార్చుకున్నాడు. క్రీజులో కుదురుకోగానే పరుగులు చేయడం ప్రారంభిస్తాడు. ఇదే తరహాలో ఆడి వెస్టిండీస్ దిగ్గజం రిచర్డ్స్ను గుర్తుకు తెస్తున్నాడు. కచ్చితమైన నిలకడ, సాధికారతతో ఆడే మరో బ్యాట్స్మన్ను నేనెక్కడా చూడలేదు. అతనో విజేత. అతనెప్పుడు బాగా ఆడితే అప్పుడు భారత్ మెరుగ్గా ఉంటుంది' అని అమర్నాథ్ అన్నారు.
సౌతాంప్టన్ పిచ్ ఎలా ఉన్నా కోహ్లీ రాణిస్తాడని అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. జట్టులోకి శిఖర్ ధావన్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కేఎల్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ జోడీ బాగా ఆడగలదని పేర్కొన్నారు. వీరిద్దరూ భారీ పరుగులు చేయకున్నా భారత్కు కావాల్సిన శుభారంభం అందిస్తే చాలన్నారు.
2014 నుంచి కోహ్లీ ప్రదర్శనలో చాలా మార్పు వచ్చింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన ఆసియా జట్టు కెప్టెన్టలో కోహ్లీనే అత్యధిక స్కోరు నమోదు చేసి రాహుల్ ద్రవిడ్ రికార్డు సైతం బద్దలు కొట్టాడు. టెస్టు సిరీస్లలో సునీల్ గవాస్కర్ చేసిన పరుగుల కంటే ఎక్కువ చేసి కొత్త రికార్డులు సృష్టించాడు.