IND vs ENG: 'విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది.. మాకు కావాల్సింది కూడా అదే'

లీడ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉండడం ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ఆట పరంగా తామిద్దరి మధ్య వైరం ఉందని, అయితే మైదానంలో ఇవన్నీ సహజమే అని జిమ్మీ అన్నాడు. వయసు పెరిగినా.. ఆటలో కొనసాగేందుకు నెట్స్లో తక్కువగా బంతులు వేస్తున్నట్లు చెప్పాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత పతనాన్ని శాశించింది జిమ్మీనే. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ను పెవిలియన్ చేర్చి.. టీమిండియాను కోలుకొని విధంగా దెబ్బకొట్టాడు.

మా బలాలపై దృష్టి సారించాం:
మూడో టెస్టు తొలి రోజు ఆట అనంతరం జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడాడు. 'లార్డ్స్ టెస్టు (రెండో మ్యాచ్) తర్వాత మేం డ్రెసింగ్ రూమ్లో మాట్లాడుకున్నాం. కెప్టెన్, కోచ్ చాలా సమయం మాట్లాడారు. మా బలాలపై దృష్టి సారించాలని అనుకున్నాం. బయటి చప్పుళ్లకు (గొడవలకు) తెరవేయాలని నిర్ణయించుకున్నాం. నిజానికి లార్డ్స్లో మూడు రోజుల వరకు మేం బాగానే ఆడాం. ఆ తర్వాత జరిగిందే.. మాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏదేమైనా మనం మనుషులం. తప్పులు చేయడం సహజం. ఏదేమైనా మా బలాలపై దృష్టి పెట్టాం' అని చెప్పాడు.

కోహ్లీని ప్రశాంతంగానే ఉంచాలి:
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయడం నాకెంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య ఆట పరంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒక్కోసారి పరిమితులు దాటాల్సి వస్తుంది. అయితే కోహ్లీని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంచాలి. లేకుంటే అతడి విధ్వంసాలను ఆపలేం. నిజానికి ఈ సిరీస్లో కోహ్లీకి మేం చక్కగా బౌలింగ్ చేశాం. మా ప్రణాళికలు అమలు కూడా అయ్యాయి. ఇకపై సాధ్యమైనంత మేరకు అతడిని ప్రశాంతంగానే ఉంచుతాం' అని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. ప్రస్తుత మ్యాచును జిమ్మీ 2010లో ఆసీస్తో ఆడిన యాషెస్ మ్యాచుతో పోల్చాడు. తమ ఓపెనర్లు ఈ పోరులో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారని ప్రశంసించాడు. విజయం సాధించేందుకే బరిలోకి దిగామని చెప్పాడు.

వయసు పెరిగినా వికెట్లు తీయడం సంతోషం:
వయసు పెరిగినా వికెట్లు తీయడం సంతోషకరంగా ఉందని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జిమ్మీ అన్నాడు. 'వయసు పెరుగుతుండటంతో జిమ్లో ఎక్కువ కసరత్తులు చేయాల్సి వస్తోంది. మ్యాచులో త్వరగా అలసిపోకుండా ఉండేందుకు నెట్స్లో తక్కువగా బౌలింగ్ చేస్తున్నా. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడం కీలకం. సుదీర్ఘ ఫార్మాట్కు మానసికంగా సిద్ధమవ్వడమే అతిపెద్ద సవాల్. ఇప్పటికీ నా కుడి భుజం నొప్పి వేధిస్తోంది. కానీ ఇవన్నీ ఆటలో భాగమే' అని 39 ఏళ్ల జిమ్మీ చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా అండర్సన్ కొనసాగుతున్నాడు.

70 ఏళ్లలో తొలిసారి:
లార్డ్స్ టెస్టు ద్వారా జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడంతో.. గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. టెస్టు క్రికెట్లో అతి పెద్ద వయసులో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్కు ఇది 31వ సారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications