రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు.
అయితే శనివారం ఆటలో తొలి ఇన్నింగ్స్లో ఓ సందర్భంలో భారత్ స్కోరు 177/7 మాత్రమే. కానీ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149 బంతుల్లో) అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అనుభవం లేకపోయినా అద్భుతంగా పోరాడి టీమిండియాను 307 పరుగుల స్కోరుకు చేర్చాడు. కుల్దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతేగాక అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో సెంచరీని చేజార్చుకున్నాడు.

ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్పై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. టీమిండియాకు మరో ధోనీ తయారవుతున్నాడని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. అయితే ధ్రువ్ జురెల్ పట్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆరోపించాడు. ధ్రువ్ అద్వితీయ ఇన్నింగ్స్కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని అన్నాడు. ప్రదర్శనకు తగ్గట్లుగా అందరికీ సమానంగా హైప్ ఇవ్వట్లేదని పేర్కొన్నాడు.
'' మీడియా హైప్ లేదు, డ్రామా లేదు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నైపుణ్యాలతో నిశ్శబ్ధంగా ధ్రువ్ జురెల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ధ్రువ్కు శుభాకాంక్షలు'' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దానికి వివరణ ఇస్తూ వీరూ మరో ట్వీట్ పోస్ట్ చేశాడు. ''ఎవరినీ కించపరచట్లేదు, ఎవరినీ అవమానించట్లేదు. ప్రదర్శనకు తగ్గట్లుగా ఆటగాళ్లకు సమానమైన హైప్ ఇవ్వాలి. కొందరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మరికొందరు బ్యాటింగ్లో సత్తాచాటారు. అయితే వాళ్లకు దక్కాల్సిన హైప్ దక్కలేదు''
''ఆకాశ్ దీప్ గొప్పగా బౌలింగ్ చేశాడు. సిరీస్ ఆద్యంతం యశస్వీ జైస్వాల్ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. రాజ్కోట్లో సర్ఫరాజ్ ఖాన్ రాణించాడు. ధ్రువ్ జురెల్ తనకొచ్చిన అవకాశాల్లో అదరగొట్టాడు. అందరికీ హైప్ ఇవ్వండి'' అని సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. అయితే మీడియాలో సర్ఫరాజ్కు ఇచ్చిన హైప్ ధ్రువ్ జురెల్ విషయంలో ఇవ్వలేదని ఉద్దేశంతో సెహ్వాగ్ ట్వీట్ చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.