ఇంగ్లండ్తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుతున్న రాహుల్ ఇప్పటికే రెండు, మూడు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. అయితే 90 శాతం ఫిట్నెస్ సాధించాడని, ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు రాహుల్ అందుబాటులో వస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే ఆఖరి టెస్టుకు కూడా రాహుల్ అందుబాటులో ఉండటంపై స్పష్టత లేదు. అప్పటికి ఫిట్గా ఉంటే అయిదో టెస్టుకు రాహుల్ జట్టులోకి వస్తాడని బీసీసీఐ తెలిపింది. కేఎల్ రాహుల్తో పాటు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది.

బుమ్రా గత మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు బౌలింగ్ వేశాడు. 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసింది బుమ్రానే. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో బుమ్రా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో యువ పేసర్ ముకేశ్ కుమార్ తిరిగి జట్టులోకి వస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
మూడో టెస్టుకు ముందు ముకేశ్ కుమార్ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో పాల్గొనమని ముకేశ్కు బీసీసీఐ సూచించింది. బెంగాల్ తరఫున బిహార్తో జరిగిన మ్యాచ్లో ముకేశ్ పది వికెట్లతో సత్తాచాటాడు. కాగా, రెండు, మూడు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) , కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్