టెస్టు చరిత్రలో టీమిండియా రికార్డు గెలుపును నమోదు చేసింది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో అయిదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. జడేజా అయిదు వికెట్లతో సత్తాచాటాడు.
విజయంలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో) కీలక పాత్ర పోషించాడు. 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో 33 పరుగులకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా శతకాలతో కదం తొక్కి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వారి ఇన్నింగ్స్లు చూసి ప్రేరణకు గురయ్యానని, కుదురుకుంటే భారీ స్కోర్లు సాధించవచ్చని గ్రహించానని యశస్వీ జైస్వాల్ తెలిపాడు.

'' కుదురుకుంటే భారీ స్కోరు సాధించడానికి ప్రయత్నిస్తా. టెస్టు క్రికెట్ను ఊహించలేం. అందుకే వీలైనంత పరుగులు చేయడానికే ట్రై చేస్తా. అయితే తొలుత క్రీజులో నిలదొక్కుకోవడానికి కష్టపడ్డా. అందుకే సెషన్ వరకు నిదానంగా ఆడాను. తర్వాత లయను అందుకున్నా. అయితే ఆ తర్వాత వెన్నునొప్పి వచ్చింది. మైదానాన్ని వీడొద్దనుకున్నాను. కానీ తప్పలేదు''
''ఇక ఇవాళ ఆటలో తిరిగి బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఆఖరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా. స్కోరు సాధిస్తూ జట్టును ముందుకు నడిపించాలనుకున్నా. రోహిత్, జడేజా ఆడిన ఇన్నింగ్స్లు స్ఫూర్తి రగిలించాయి. వారి అంకిత భావాన్ని చూసి సెషన్ల పాటు ఆడాలనుకున్నా. ఎప్పుడైనా సరే, 100 శాతం జట్టు కోసం కష్టపడతా'' అని జైస్వాల్ అన్నాడు. శనివారం ఆఖర్లో వ్యక్తిగత స్కోరు 104 వద్ద జైస్వాల్ రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో 545 పరుగులు చేసిన జైస్వాల్.. గంగూలీ (534 రన్స్) రికార్డును బ్రేక్ చేశాడు. అంతేగాక భారత్ తరఫున వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇక
12 సిక్సర్లు బాదిన జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వసీమ్ అక్రమ్ (పాకిస్థాన్)తో కలిసి చరిత్రకెక్కాడు.