ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్టులో ఆల్రౌండ్ షోతో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. అయిదు టెస్టుల సిరీస్ను 4-1తో టీమిండియా గ్రాండ్గా ముగించింది. తొలి టెస్టులో ఓటమి అనంతరం వరుస విజయాలతో టీమిండియా హోరెత్తించింది.
విజయానంతరం ట్రోఫీని అందుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. విన్నింగ్ క్రెడిట్ టీమ్ మొత్తానికి దక్కుతుందని రోహిత్ చెప్పాడు. యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు. విజయంలో బౌలర్ల పాత్ర అమోఘమని అన్నాడు. కుల్దీప్ యాదవ్, యశస్వీ జైస్వాల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

''టెస్టు సిరీస్ గెలవాలంటే అన్ని విభాగాల్లో సత్తాచాటాలి. జట్టులో ఆటగాళ్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు కాస్త అనుభవం తక్కువగా ఉంది. కానీ వాళ్లు ఎంతో క్రికెట్ ఆడారు. ఒత్తిడిని జయిస్తూ రాణించారు. గెలుపు క్రెడిట్ టీమ్కు ఇవ్వాలి. ఇలా టెస్టు సిరీస్ను గెలిచినప్పుడు సెంచరీల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు సాధించాలి. బౌలర్లు వాళ్ల బాధ్యతలు గొప్పగా నిర్వర్తించడం ఎంతో సంతోషంగా ఉంది''
''కుల్దీప్తో మేం తరుచూగా మాట్లాడుతుంటాం. అతనికి ఎంతో సామర్థ్యం ఉంది. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గాయంతో కొన్నాళ్లు జట్టుకు దూరమైన కుల్దీప్ ఎంతో కష్టపడ్డాడు. ఎన్సీఏలో తీవ్రంగా శ్రమించాడు. కుల్దీప్ బ్యాటింగ్లోనూ సత్తాచాటడం ఆనందంగా ఉంది''
''ఇక యశస్వీ జైస్వాల్ విషయానికొస్తే.. అతనికి గొప్ప భవిష్యత్ ఉంది. మంచి స్థితిలో కొనసాగుతున్నాడు. అతని బాధ్యతలను అర్థం చేసుకుంటాడు. బౌలర్లను ఒత్తిడిలోకే నెట్టే సామర్థ్యం అతడి సొంతం. ఆ వైఖరిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కానీ అతడు కఠినమైన వ్యక్తి. సవాళ్లను ఆస్వాదిస్తాడు. సిరీస్లో పరుగుల వరద పారిస్తూ అద్భుత ప్రదర్శన చేశాడు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ సిరీస్లో జైస్వాల్ 712 పరుగులు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.