ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. 150 బంతుల్లో 110 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. గిల్ శతకం అనంతరం గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ కూడా స్టేడియంలో ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.
అయితే ఇంగ్లండ్తో తొలి టెస్టు అనంతరం గిల్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో విఫలమవుతున్న గిల్ను తప్పించి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపించాయి. కానీ వైజాగ్ టెస్టులో సెంచరీ అనంతరం గిల్ ఆటతీరు మారింది. స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు.

కాగా, మూడో స్థానంలో బ్యాటింగ్కు రావడమే తన కొడుకు ఒత్తిడికి కారణమని శుభ్మన్ గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ తెలిపారు. ఓపెనర్గా అయితే గిల్ శైలికి అనుకూలంగా ఉండేదని అన్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువసేపు ఎదురుచూడటం వల్ల గిల్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ''ఏ స్థితిలో బ్యాటింగ్ వచ్చామనేది చాలా కీలకం. సహజసిద్ధమైన ఆట ఆడకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అండర్-16 రోజుల నుంచి గిల్ స్పిన్నర్లు, పేసర్లపై దూకుడుగా ఆడేవాడు''
''గిల్ ఓపెనర్గానే కంటిన్యూ చేయాల్సింది. మూడో స్థానం అతనికి సెట్ అవ్వదని భావిస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువసేపు కూర్చొని ఉండటం ఒత్తిడికి గురిచేస్తుంటుంది. వన్డౌన్లో వచ్చే స్థానం అటు ఓపెనింగ్ కాదు, ఇటు మిడిలార్డర్ కాదు. గిల్ నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోవట్లేదు. నిర్ణయాలు తీసుకునే వయస్సుకు అతడు చేరుకున్నాడు. గిల్ టీనేజర్గా ఉన్నప్పుడు మాత్రమే అతని తరఫున నేను నిర్ణయాలు తీసుకున్నా'' అని లఖ్విందర్ సింగ్ పేర్కొన్నారు.
యశస్వీ జైస్వాల్ రాకతో టెస్టుల్లో గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. మరోవైపు జైస్వాల్ ఓపెనర్గా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గిల్ తిరిగి ఓపెనర్ పొజిషన్ అందుకోవడం దాదాపు అసాధ్యమే. అంతేగాక గిల్ వన్డౌన్లో కుదురుకున్నాడు. ఆదిలో ఇబ్బంది పడినా క్రమంగా అంచనాలను అందుకుంటున్నాడు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో సెంచరీ చేసిన గిల్ మూడు, నాలుగు టెస్టుల్లో అర్ధశతకాలు సాధించాడు. రాజ్కోట్ టెస్టులో తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 91 పరుగుల వద్ద రనౌటయ్యాడు.