ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీస్కోరు దిశగా సాగుతోంది. భారత బ్యాటర్లు సమష్టిగా పరుగులు సాధిస్తున్నారు. టాప్-5 బ్యాటర్లు 50+ స్కోరు సాధించడం విశేషం.
అరంగేట్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో) అర్ధశతకంతో చెలరేగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ అనుకూల పరిస్థితుల్లో క్రీజులోకి రాలేదు. సెంచరీలతో కదం తొక్కిన రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో), శుభ్మన్ గిల్ (110; 150 బంతుల్లో) వరుస ఓవర్లలో ఔటైన స్థితిలో బ్యాటింగ్కు వచ్చాడు.

ఇంగ్లండ్ తిరిగి పోటీలోకి వచ్చిన స్థితిలో ఒత్తిడిని జయిస్తూ పడిక్కల్ బ్యాటింగ్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నాలుగో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలుత పడిక్కల్ సాధికారికంగా ఆడలేదు. రెండు సార్లు బ్యాట్కు ఎడ్జ్ తీసుకుని స్లిప్ల్లోకి వెళ్లింది. కానీ అదృష్టంతో అవి బౌండరీలుగా మారాయి.
అనంతరం కుదురుకోవడానికి కాస్త సమయాన్ని తీసుకున్న పడిక్కల్ తర్వాత వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ప్రతిబంతిని దాడికి ప్రయత్నించకుండా ఆటను అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 83 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. లాంగాన్ మీదుగా భారీ సిక్సర్తో అర్ధశతకం సాధించాడు. అనంతరం ప్రశాంతతో బ్యాటును ఎత్తి సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే షోయబ్ బషీర్ బౌలింగ్లోనే పడిక్కల్ ఔటయ్యాడు.
ప్రస్తుతం భారత్ 101.1 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 427 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (15; 25 బంతుల్లో), జడేజా (15; 50 బంతుల్లో) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, అండర్సన్, బెన్ స్టోక్స్, టామ్ హర్ట్లీ తలో వికెట్ సాధించారు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్స్టో చేసిన 29 పరుగులు (18 బంతుల్లో).