ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విజేతను ప్రకటించింది ఐసీసీ. టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ ప్రతిష్టాట్మక అవార్డు రేసులో నామినేట్ అయ్యారు. ట్రావిస్ హెడ్, సికందర్ రాజా, బాబర్ ఆజం, అర్షదీప్ సింగ్ ను నామినేట్ చేసింది ఐసీసీ. వీరిలో నుంచి తాజాగా అర్షదీప్ సింగ్ విజేతగా నిలిచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.
యువ పేసర్ అర్షదీప్ సింగ్ చాలా కాలంగా టీ20 క్రికెట్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఎనిమిది మ్యాచ్ల్లో 7.16 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీలో కీలక పాత్ర పోషించిన అతడు.. 2024లో అత్యంత కీలకమైన వికెట్ టేకర్గానూ అవతరించాడు. మొత్తంగా 18 మ్యాచ్ల్లో 13.50 సగటుతో 36 వికెట్లు తీసి అదర గొట్టాడు. అటు పవర్ప్లే, ఇటు డెత్ ఓవర్లలో ప్రధానంగా బౌలింగ్ చేసి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. 2024 సంవత్సరాన్ని 7.49ఎకానమీ రేటుతో ముగించాడు.
యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో (4/9) సంచలన బౌలింగ్ చేశాడు అర్షదీప్ సింగ్. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు (97) తీసింది కూడా అర్ష్దీ సింగే. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలుస్తాడు.

మొత్తం నలుగురు
ఓ క్యాలెండర్ ఇయర్లో ప్రపంచంలో అర్ష్దీప్ కన్నా నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ T20I వికెట్లు పడగొట్టారు. వారిలో సౌదీ అరేబియాకు చెందిన ఉస్మాన్ నజీబ్ (38), శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా (38), యూఏఈకు చెందిన జునైద్ సిద్ధిక్ (40), హాంకాంగ్కు చెందిన ఎహ్సాన్ ఖాన్ (46) ముందున్నారు. ఈ బౌలర్లలో, హసరంగ మాత్రమే పూర్తి సభ్య దేశం తరపున ఆటగాడు.
మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లోనూ చోటు
అంతకుముందు మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో ఏకంగా నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య, బుమ్రా, అర్షదీప్ ను ఎంపిక చేసింది. 11 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది.