ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గావస్కర్ సిరీస్లో నిరాశపరిచిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఆస్వాదిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత లభించిన విరామ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు, పలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నాడు.
రీసెంట్ గా అతడు భార్య అనుష్క శర్మతో కలిసి ముంబయి వీధుల్లోనూ విహరించాడు. అలా అతడు తన భార్యతో కలిసి నగర వీధుల్లో విహరిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఆకస్మికంగా కోహ్లీనీ అక్కడున్నవాళ్లంతా చూసి ఆశ్చర్యపోతున్నారు. అతడితో కలిగి సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారుతున్నాయి.

తాజాగా విరాట్ కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే అతడు అలీబాగ్ కు తన భార్యతో కలిసి ఓ జెట్టీ రైడ్ చేశాడు. గేట్ వే దగ్గర నుంచి బోట్ రైడ్ చేశాడు. అయితే బోట్ రైడ్ కు కోసం వెళ్లేటప్పుడు దారిలో చాలా మంది విరాట్ తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయినా అతడు సైలెంట్ గా వారి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే బోట్ లోకి జంప్ చేసి స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే బోట్ కోసం వెళ్లే దారిలో అతడు చెప్పిన ఓ సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. "భాయ్ నేను నడిచే దారికి ఎవరూ అడ్డు పడకండి, ఆపకండి" అనడం వినిపించింది. దీనిపై మిశ్రమ కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది విరాట్ కు యాటిట్యూడ్ ఎక్కువ, అందుకే ఎవరికి ఫొటో ఇవ్వకుండా వెళ్లిపోయాడని అంటున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది కోహ్లీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎంతమందితో అతడు మాత్రం ఫొటో దిగగలడు, అతడికి కూడా ప్రైవసీ కావాలి కదా అని అంటున్నారు. ఇకపోతే విరాట్ కోహ్లీ తాను అమితంగా ఇష్టపడే వృందావన్ను కూడా తాజాగా మరోసారి సందర్శించాడు. భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కుమారుడు అకాయ్తో కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లాడు.
కాగా, ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గావస్కర్ సిరీస్లో కోహ్లీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్లోనే సెంచరీ బాదినప్పటికీ, విరాట్ మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లలో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇప్పుడు త్వరలోనే ఇంగ్లాండ్ తో సిరీస్కు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే విరాట్ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ జట్టులో అతడికి స్థానం ఇస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడనుంది.