IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు రైలులో లండన్ నుంచి లీడ్స్కు ప్రయాణించినప్పుడు ఆటగాళ్లు తమ బాల్యపు కథలను పంచుకున్నారు. బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో భారత ఆటగాళ్లు లండన్ హోటల్ నుంచి కాఫీ కప్పులు చేతిలో పట్టుకుని బయలుదేరారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురేల్ మాట్లాడుతూ.. తన తండ్రి ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)లో పోస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రయాణంలో విండో సీటు బుక్ చేసేవారని చెప్పాడు. సాయి సుదర్శన్ మాట్లాడుతూ తన బాల్యంలో క్రికెట్ శిక్షణ కోసం రైలులోనే ప్రయాణించేవాడినని తెలిపాడు. రైలు లోపల కేఎల్ రాహుల్ పోజులిస్తూ కనిపించగా.. మోర్నె మోర్కెల్ అతని ఫోటోలు తీస్తూ కనిపించాడు. ఇదే సమయంలో వాషింగ్టన్ సుందర్ను ఎవరో "జుట్టు సరిచేసుకో" అని అనగా.. సుందర్ సినిమాలలో హీరోల స్టైల్లో తన జట్టును సరిచేసుకుంటూ కనిపించాడు. హర్షిత్ రాణా కూడా టీమిండియాతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అయితే హర్షిత్ రాణాను మొదట భారత జట్టులో చేర్చలేదని గమనించాలి.

శార్దూల్ ఠాకూర్కు విండో సీటు ఆనందం
ముంబైకి చెందిన శార్దూల్ ఠాకూర్ రైలులో క్రికెట్ ప్రాక్టీస్కు వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నాడు. "నేను ఈ రైలులో విండో సీటును చాలా ఆస్వాదిస్తున్నాను, కానీ ముంబైలో అలా ఉండదు. అక్కడ ఆ కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దానితో పోలిస్తే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం విండో సీటు లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను." అని శార్దూల్ ఠాకూర్ అన్నాడు.
ఈ సారి భారత జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తోంది. టీమిండియా చివరిసారిగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్గా ఉండేవారు. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.