కోహ్లీ వంతొచ్చింది..
ఇప్పుడు తాజాగా- విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. గురువారం ఇంగ్లాండ్తో జరిగే సెమీ ఫైనల్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో బంతిని ఆడబోయి గాయపడ్డాడు కోహ్లీ. హర్షల్ లెగ్ స్టంప్ మీదికి వేసిన బంతి నేరుగా అతని గజ్జలను తాకింది. దీనితో కొద్దిసేపు కోహ్లీ నొప్పితో విలవిల్లాడాడు. నెట్స్లో మోకాళ్లపై కూర్చుండిపోయాడు. కొద్దిసేపటి తరువాత నెట్స్ నుంచి బయటికొచ్చాడు.

ఫ్యాన్స్తో సెల్ఫీలు..
ఫిజియోథెరపిస్ట్ అతనికి అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్ ఇచ్చారు. హర్షల్ పటేల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్.. అతని చుట్టూ చేరి గాయం గురించి ఆరా తీశారు. కొంతసేపటి తరువాత విరాట్ కోహ్లీ మామూలు స్థితికి చేరుకున్నాడు గానీ నెట్ ప్రాక్టీస్కు వెళ్లలేదు. అడిలైడ్ ఓవల్ స్టేడియానికి వచ్చిన అభిమానులను సరదాగా కలుసుకున్నాడు. వారితో సెల్ఫీ దిగాడు. అభిమానులను కలుసుకోవడానికి వెళ్తోన్న సమయంలో కొద్దిగా కుంటుతూ నడవడం కనిపించింది.
అచ్చంగా రోహిత్ తరహాలో..
ఇదివరకు అచ్చంగా ఇదే తరహాలో జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. ఇదే అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తోండగా.. టీమిండియా థ్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతి నుంచి వెలువడిన బంతి వేగంగా అతని కుడి చేతిని బలంగా తాకింది. దీనితో హిట్ మ్యాన్ నొప్పితో విలవిల్లాడాడు. నెట్స్ నుంచి బయటికొచ్చాడు. కొద్దిసేపు అక్కడే కూర్చుండి పోయాడు. బంతి తగిలిన చోట వాపు కనిపించింది.

విశ్రాంతి అనంతరం..
కొంత విశ్రాంతి తరువాత రోహిత్ శర్మ మళ్లీ ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొన్నాడు గానీ ఎక్కువ సేపు నెట్స్లో ఉండలేకపోయాడు. నిర్దేశిత గడువు కంటే ముందే అతను డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. అనంతరం భార్య రితిక సజ్దేతో కలిసి షాపింగ్కు వెళ్లాడు. షాపింగ్ చేస్తోన్న సమయంలో కుడి చేతికి బ్యాండేజీతో కనిపించింది. ఫిజియోథెరపిస్ట్ కట్టిన ఆ బ్యాండేజ్తోనే సాయంత్రం వరకూ గడిపాడు. ఇవ్వాళ రోహిత్ శర్మ మామూలుగానే ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. చేతికి బ్యాండేజీ కూడా లేదు. మునుపట్లా చురుగ్గా ప్రాక్టీస్ చేశాడు.


Click it and Unblock the Notifications
