టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20కు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లోనే గెలిచి మంచి శుభారంభం చేయాలని పట్టుదలో ఉన్నారు. అయితే టీమిండియాలో... గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కోహ్లీ, రోహిత్ ఈ ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జట్టు కుర్రాళ్లతో నిండిపోయింది. వీళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో 200 పరుగుల స్కోర్ సాధించడం వారికి సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా పలు రికార్డులను తన పేరిట రాసుకుంది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత తమ దూకుడును పెంచింది.
ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రదర్శన, రికార్డులు
టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా ఆడిన 11 టీ20 మ్యాచుల్లో 7 సార్లు 200కు పైగా స్కోర్ చేసింది.

ఇక లక్ష్య ఛేదనలో 156 పరుగులను 15.2 ఓవర్లలో, 132 పరుగులను 11.5 ఓవర్లలోనే అందుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఐసీసీ శాశ్వత సభ్య దేశాల మధ్య జరిగిన మ్యాచ్లలోనూ పలు రికార్డులను అందుకుంది టీమిండియా.
ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును అందుకుంది భారత జట్టు. ఆ మధ్య హైదరాబాద్లో బంగ్లాదేశ్పై 297 పరుగులు చేసింది. మరో మ్యాచులో అయితే 283 రన్స్ సాధించింది.
ఓ టీ20 మ్యాచ్లో మధ్య ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్, బౌండరీల రూపంలోనూ అత్యధిక పరుగులు.. ఇలా పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది.
టీ20 మ్యాచ్లలో సగటున ప్రతి 4.27వ బంతికి బౌండరీని నమోదు చేస్తోంది టీమిండియా. ప్రతి 2.18వ బంతికి బౌండరీ బాదేందుకు ప్రయత్నిస్తున్నారు బ్యాటర్లు.
ఇంగ్లాండ్ కూడూ దూకుడుగానే
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత మ్యాచ్ లలో ప్రతి 2.32వ బంతికి బౌండరీ నమోదు చేసేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది. ఓ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 218 పరుగులు చేసింది. మూడు సార్లు లక్ష్య ఛేదనల్లో ఓవర్కు 10కి పైగా పరుగులు సాధించింది.
ఆ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్
నిరుడు మార్చిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో 12.08 రన్రేట్ నమోదైంది. మూడు లేదా అంత కన్నా ఎక్కువ మ్యాచ్ల ఉన్న ద్వైపాక్షిక సిరీస్లలో నమోదైన అత్యధిక రన్రేట్ ఇదే కావడం విశేషం. ఇప్పుడా అత్యధిక రన్ రేట్ రికార్డు.. ఇంగ్లాండ్, టీమిండియా సిరీస్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.