రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ టీమిండియాకు దూరమవ్వడంతో అతడి స్థానాన్ని భర్తీచేసేందకు సెలక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూడు ఫార్మాట్లలో దూకుడుగా ఆడే పంత్కు ప్రత్యామ్నాయంగా ప్రధాన వికెట్ కీపర్ను వెతకడంలో ఇప్పటికే పూర్తిగా విజయవంతం కాలేకపోయారు. వన్డే, టీ20 ఫార్మాట్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఉన్నప్పటికీ టెస్టుల్లో వచ్చేసరికి ఆ స్థానానికి ఎవరూ న్యాయం చేయలేకపోతున్నారు.
వికెట్ల వెనుక గ్లవ్స్తో మెరిస్తే బ్యాటుతో విఫలమవుతున్నారు. బ్యాటుతో సత్తాచాటితే స్పిన్ పిచ్లపై వికెట్ కీపింగ్లో తడబడుతున్నారు. అందుకే కేఎల్ రాహుల్ను భారత్ పిచ్లపై స్పెషలిస్ట్ బ్యాటర్గానే పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్కు చెందిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ మంచి అవకాశాలను దక్కించుకున్నాడు. కానీ అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

దేశవాళీ క్రికెట్, భారత్-ఎ తరఫున సత్తాచాటుతున్న భరత్.. టీమిండియాలో మాత్రం చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బ్యాటింగ్లో తీవ్ర నిరాశకు గురిచేశాడు. దీంతో మరో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు అవకాశం వచ్చింది. ధ్రువ్ జురెల్ సంచలన ప్రదర్శన చేయనప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 146 Kmph వేగంతో వచ్చిన బౌన్సర్ను సమయస్ఫూర్తితో సిక్సర్గా మలిచాడు.
అంతేకాకుండా వికెట్ల వెనుక అదరగొడుతున్నాడు. బ్యాట్కు ఎడ్జ్ తీసుకోవడం, స్పిన్ వల్ల రిఫ్లెక్ట్ అయిన బంతులను కూడా గొప్పగా అందుకున్నాడు. అంతేగాక సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ మెరుపు రనౌట్ చేశాడు. రాజ్కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్కు అవకాశం వచ్చిన ధ్రువ్ 104 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అయితే ధ్రువ్కు టీమిండియా టీ20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక మద్దతు ఇస్తున్నాడు. వికెట్ల వెనుక 'వావ్' అనేలా ధ్రువ్ జురెల్ ప్రదర్శన చేస్తున్నాడని సూర్య ట్వీట్ చేశాడు.
వైజాగ్ టెస్టులో కేఎస్ భరత్ కూడా మెరుపు క్యాచ్ అందుకున్నాడు. ఒకట్రెండు సందర్భాల్లో తడబడినప్పటికీ వికెట్ల వెనుక క్లాసిక్ వికెట్ కీపింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ భరత్కు హర్షా భోగ్లే మినహా ఎవరూ సోషల్ మీడియాలో మద్దతు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన భరత్ 12 ఇన్నింగ్స్ల్లో 221 పరుగులు చేశాడు. ఒక్కసారి నాటౌట్గా నిలిచాడు. అత్యధిక స్కోరు 44. రేపటి నుంచి రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులోనే భరత్కు బదులుగా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యా అవకాశాలు ఎక్కువ.