లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ గా సాగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ పై టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ (72*) ఆఖరి వరకు క్రీజ్లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ బ్యాటింగ్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. అయితే తాను ఓ దశలో కంగారు పడినట్లు వివరించాడు.
ఇక్కడ అలా కుదరలేదు
"మ్యాచ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160+ పరుగులు సులభంగానే ఛేదించవచ్చని అనుకున్నాం. కానీ, ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బంతులేసి మ్యాచ్ ను కాస్త టఫ్ చేశారు. గత రెండు, మూడు సిరీస్ల నుంచి మేం అదనపు బ్యాటర్తో బరిలోకి దిగుతున్నాం. గత మ్యాచ్లో దూకుడుగా ఆడినట్టుగా ఇక్కడ ఆడలేకపోయాం. మేం అగ్రిసివ్ గా క్రికెట్ ఆడుతున్నాం. కానీ అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం ఎంతో కీలకం. మా కుర్రాళ్లు అదే పని చేసి, నాపై ఒత్తిడిని తగ్గించారు.

నేను బయటకు వచ్చి ఏమవుతుందోనని కాస్త కంగారు పడుతూ కూర్చున్నా. కానీ, తిలక్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. బాధ్యత తీసుకుని ఆడాడు. అతడితో పాటు బిష్ణోయ్, అర్ష్దీప్ బాగా ఆడారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం నిజంగా చాలా బాగుంది. అందరం ఒకే బాటలో పయణిస్తే, ఫలితాలు కూడా మంచిగా వస్తాయి" అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో.. తొలి టీ20లోలాగా ఇంగ్లాండ్ జట్టు అంత ఈజీగా లొంగలేదు. సవాలు విసిరే లక్ష్యాన్ని నిలిపింది. బంతితోనూ భారత్ను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన సూపర్ ఫామ్ తో.. భారత జట్టును గెలిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలోనే 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (12) మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (2) కూడా విఫలమయ్యాడు.