
లండన్: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మాటల యుద్ధం కొనసాగుతోంది. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండడంతో.. ఆధిపత్యం చెలాయించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు గొడవలు పడుతున్నారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గి రాజుకుంది. కోహ్లీ, అండర్సన్ అయితే గీతదాటి ప్రవర్తించారు. దీంతో ఫాన్స్ సహా.. మాజీ, ప్రస్తుత క్రికెటర్లు వారి ప్రవర్తనపై స్పందిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే...
ఆటలో మూడో రోజు ఇంగ్లండ్ ఆలౌటైనప్పటి నుంచి ఈ ఘటన మొదలైంది. ఇంగ్లండ్లో 11వ స్థానంలో జేమ్స్ అండర్సన్ బ్యాటింగ్ చేశాడు. అప్పుడు జస్ప్రీత్ బుమ్రా వరుస బౌన్సర్లతో అతడిని ఇబ్బంది పెట్టాడు. ఓ బంతి జిమ్మీ హెల్మెట్కు తాకగా.. చాలాసార్లు శరీరంకు తగిలాయి. జిమ్మీని ఔట్ చేయగానే బుమ్రాను దుర్భాషలాడుతూ అతడు పెవిలియన్కు వెళ్లాడు. ఇదే విషయాన్ని భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ బయటపెట్టాడు.
చేతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేసేటప్పుడు జేమ్స్ అండర్సన్కు విరాట్ కోహ్లీ ఘాటుగా బదులిచ్చాడు. 'బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా? (ఓ బూతు మాట వాడుతూ) ఇదేమీ నీ సొంత అడ్డా కాదు' అని కోహ్లీ కోపంగా అండర్సన్ను చూస్తూ అనడం స్టంప్ మైక్రోఫోన్లో వినిపించింది. ఆ వెంటనే అండర్సన్ ఏదో అన్నాడు కానీ.. అది వినిపించలేదు. దానికి మరలా కోహ్లీ స్పందిస్తూ.. 'వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు' అని అన్నాడు. దీంతో జిమ్మీ మరేమీ అనకుండా బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. దాంతో ఆ మాటల యుద్ధం అక్కడితో ముగిసిపోయింది.
జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఘటన నెట్టింట వైరల్ అయింది. దీనిపై ఇంగ్లండ్ మరో పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ.. కోహ్లికి కౌంటర్ వేశాడు. 'అండర్సన్ సొంత గడ్డలాగే ఇదీ. అతడికి దగ్గరైన అడ్డా అని లార్డ్స్ ఆనర్స్ బోర్డు చెబుతోంది. అతడి దూకుడు నాకు నచ్చింది. కానీ అతడు ఉపయోగించిన భాష మాత్రం చిక్కుల్లో పడేయొచ్చు' అని బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఓవర్నైట్ స్కోరు 181/6తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓవర్ నైట్ స్కోరుకు 13 పరుగులు జోడించిన అనంతరం రిషబ్ పంత్ అవుటయ్యాడు. 22 పరుగులు చేసిన పంత్.. రాబిన్సన్ బౌలింగులో కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరికాసేపటికే ఇషాంత్ శర్మ (16) కూడా ఔట్ అయ్యాడు. షమీ, బుమ్రా క్రీజులో ఉన్నారు. టీమిండియా 8వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ఆధిక్యం 185 పరుగులకు పెరిగింది.