IND vs ENG: శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సన్నాహాలు చేస్తోంది. యువ ఆటగాళ్లతో నిండిన ఈ జట్టుకు ఇంగ్లాండ్లో గెలవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. ఇటువంటి సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శ్రేయస్ అయ్యర్ను జట్టులో చేర్చకపోవడంపై సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
జూన్ 20 నుంచి భారత జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. దీని కోసం జూన్ 7 నుంచి ఆటగాళ్లు ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల అనుభవం ఈ పర్యటనలో తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది యువ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ పరిస్థితులు సవాలుగా మారనున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. " ఆస్ట్రేలియాలో మన యువ జట్టు అద్భుతంగా రాణించింది. అప్పుడు రోహిత్-విరాట్ లేరు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, అభిమన్యు, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ తిరిగి వచ్చారు. నా దృష్టిలో ఇది వీరందరికీ ఒక అవకాశం.. ఎటువంటి ఒత్తిడి లేదు. ఈ పరిస్థితులు మీకు సవాలు విసురుతాయి కానీ మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి కూడా."అని అన్నారు.

శ్రేయస్ అయ్యర్ లేకపోవడంపై సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?
ఈ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ శ్రేయస్ అయ్యర్ను జట్టులో చేర్చకపోవడంపై సెలెక్టర్లపై సౌరవ్ గంగూలీ విమర్శలు గుప్పించారు. సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. " శ్రేయస్ అయ్యర్ ఒక సంవత్సరంగా తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉండాల్సింది. శ్రేయస్ అయ్యర్ జట్టు నుంచి బయట ఉండాల్సిన ఆటగాడు కాదు. అయ్యర్ ఇప్పుడు ఒత్తిడిలో కూడా మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. బాధ్యతలను అర్థం చేసుకుంటున్నాడు. షార్ట్ బంతులను కూడా ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ భిన్నంగా ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్లో చేరితే అతని సామర్థ్యాన్ని చూడాలని కోరుకుంటున్నాను." అని గంగూలీ పేర్కొన్నారు.
శ్రేయస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే.. 14 మ్యాచ్లలో 24 ఇన్నింగ్స్లలో 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఫిబ్రవరి 2024లో ఇంగ్లాండ్ జట్టుతో ఆడాడు.
భారత టెస్ట్ జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.