IND vs ENG: భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. బ్రిస్టల్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఓపెనింగ్ జోడి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్లలో అత్యధిక పరుగులు సాధించిన జోడీగా నిలిచింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ జోడీ టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు మొత్తం 2726 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున అలిస్సా హీలీ, బెత్ మూనీ జోడీ మొత్తం 2720 పరుగులు చేయగా.. వారిని అధిగమించింది.
ఈ జాబితాలో సుజీ బేట్స్, సోఫీ డివైన్ జోడీ మూడో స్థానంలో ఉంది. ఈ జోడీ న్యూజిలాండ్ జట్టు కోసం మొత్తం 2556 పరుగులు చేసింది. ఈషా ఓఝా, తీర్థా సతీష్ జోడీ ఇప్పటవరకు యూఏఈ కోసం మొత్తం 1985 పరుగులు చేసింది. అయితే ఐదో స్థానంలో ఉన్న కవిశా ఇగోడాగే, ఈషా ఓఝా జోడీ యూఏఈ జట్టు తరఫున మొత్తం 1976 పరుగులు చేసింది.

రెండో టీ20లోనూ భారత్దే విజయం
బ్రిస్టల్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జట్టు 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి జెమీమా రోడ్రిగ్స్.. అమన్జోత్ కౌర్తో కలిసి నాలుగో వికెట్కు 93 పరుగులు జోడించింది. జెమీమా రోడ్రిగ్స్ 41 బంతుల్లో ఒక సిక్సర్, 9 ఫోర్లతో 63 పరుగులు చేసి ఔట్ అయింది. ఇక్కడ నుంచి అమన్జోత్ రిచా ఘోష్తో కలిసి ఐదో వికెట్కు 57 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ను భారీ స్కోరుకు చేర్చింది. అమన్జోత్ 40 బంతుల్లో 63 పరుగులు చేయగా.. రిచా ఘోష్ 20 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు తరఫున లారెన్ బెల్ అత్యధికంగా రెండు వికెట్లు తీయగా.. లారెన్ ఫైలర్, ఎమ్ అర్గాట్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి టామీ బ్యూమాంట్ అమీ జోన్స్తో కలిసి 70 పరుగులు జోడించింది. టామీ 35 బంతుల్లో 54 పరుగులు చేసి ఔట్ అయింది. టామీ ఇన్నింగ్స్లో ఒక సిక్సర్, 8 ఫోర్లు ఉన్నాయి. అమీ జోన్స్ 27 బంతుల్లో 32 పరుగులు చేసింది. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన సోఫీ స్కెల్టన్ 23 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. భారత్ తరఫున శ్రీచరణి అత్యధికంగా రెండు వికెట్లు తీసింది. ఇది ఆమెకు రెండో టీ20 మ్యాచ్. గత మ్యాచ్లో ఆమె 4 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ ఒక్కో వికెట్ తీశారు. బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేసిన అమన్జోత్ను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపిక చేశారు.