ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ ఆఖరి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మార్నింగ్ సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా రెండో సెషన్ ప్రారంభంలో తడబడింది. వరుస ఓవర్లలో సెంచరీ హీరోలు రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో), శుభ్మన్ గిల్ (110; 150 బంతుల్లో) పెవిలియన్కు చేరారు.
దాదాపు ఎనిమిది నెలల తర్వాత తిరిగి బౌలింగ్ చేసిన బెన్ స్టోక్స్ తొలి బంతికే రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో గిల్ను అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అంతకుముందు అండర్సన్, గిల్ గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇవాళ ఆటలో ఆది నుంచే వీరిద్దరి మధ్య హీట్ మూమెంట్ ఏర్పడింది. గిల్ అండర్సన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్ సాధించాడు. క్రీజును వదిలిపెట్టి ముందుకు వచ్చి బౌలర్ తలమీదుగా సిక్సర్ బాదాడు. ఈ షాట్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రెండో సెషన్ ప్రారంభ ఓవర్లోనూ అండర్సన్కు రెండు బౌండరీలతో గిల్ స్వాగతించాడు. అప్పుడే గిల్ను అండర్సన్ కవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికే రివర్స్ స్వింగ్తో గిల్ను అండర్సన్ బోల్తాకొట్టించాడు.
టెస్టుల్లో శుభ్మన్ గిల్ను అండర్సన్ను ఔట్ చేయడం ఇది ఆరోసారి. అండర్సన్ వేసిన 166 బంతుల్లో గిల్ 91 పరుగులు సాధించాడు. మరోవైపు గిల్ వికెట్తో అండర్సన్ టెస్టుల్లో తన ఖాతాలో 699 వికెట్ వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (27; 37 బంతుల్లో), దేవదత్ పడిక్కల్ (34; 48 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ క్రమంగా దూకుడు పెంచుతోంది.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్స్టో చేసిన 29 పరుగులు (18 బంతుల్లో).