రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయిదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. 192 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 61 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఛేదనలో రోహిత్ శర్మ (55; 81 బంతుల్లో) శుభ్మన్ గిల్ (52*; 124 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు. ధ్రువ్ జురెల్ (39*; 77 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే టీమిండియా ఛేజింగ్ సాఫీగా సాగలేదు. ఓ దశలో 84/0తో విజయం వైపుకు దూసుకెళ్లిన భారత్ 120 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

జో రూట్ తొలి బంతిని ఎదుర్కొన్న యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) ఔటయ్యాడు. అండర్సన్ అద్భుత క్యాచ్తో వెనుదిరిగాడు.అనంతరం టామ్ హర్ట్లీ వేసిన బంతిని రోహిత్ శర్మ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. క్రీజును వదిలి ముందుకు వచ్చి డిఫెండ్కు ప్రయత్నించాడు. కానీ బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ షోయబ్ బషీర్ వేసిన వలలో చిక్కుకున్నాడు. డిఫెండ్కు ట్రై చేసి ఒలీ పోప్కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజా (4; 33 బంతుల్లో)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మరో వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు. కానీ సెకండ్ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా, సర్ఫరాజ్ ఖాన్ ఔటయ్యారు. వీరిద్దరి షోయబ్ బషీర్ బోల్తాకొట్టించాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధ్రువ్తో కలిసి గిల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ జోడీ ఒత్తిడికి చిత్తుకాకుండా గొప్పగా పోరాడారు. ధ్రువ్-గిల్ ఆరో వికెట్కు అభేద్యమైన 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ రెండు వరుస సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ అందుకోవడం విశేషం.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ - 353
భారత్ తొలి ఇన్నింగ్స్ - 307
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ - 145
భారత్ రెండో ఇన్నింగ్స్ - 192/5