IND vs ENG: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి అంచున్న ఉన్నప్పుడు యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ పలికిన కొన్ని మాటలు ఆట గమనాన్నే మార్చేశాయి. శుభ్మన్ గిల్ ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు భారత జట్టుకు కొత్త నమ్మకాన్ని ఇచ్చి మ్యాచ్లో అద్భుతంగా పుంజుకోవడానికి సహాయపడ్డాయి. ఇది కేవలం ఒక మాట కాదు, ఒత్తిడిలో ఉన్న జట్టుకు ఆత్మస్థైర్యాన్ని నింపి గెలుపు ఆశలను చిగురింపజేసిన ఒక మంత్రం అని చెప్పొచ్చు.
ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. చరిత్రలో ఈ మైదానంలో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఏ జట్టు కూడా ఛేదించి గెలవలేకపోవడం గమనార్హం. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో కేవలం 106 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి తడబడింది.దీంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత బౌలింగ్ను చెదరగొట్టారు. ఈ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు ఏకంగా 195 పరుగులు జోడించి, ఇంగ్లండ్ విజయాన్ని దాదాపు ఖాయం చేశారనిపించింది. ముఖ్యంగా జో రూట్ తన కెరీర్లో 39వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసినప్పుడు, ఇంగ్లండ్ విజయానికి కేవలం 44 పరుగులు మాత్రమే అవసరం కాగా, వారి చేతిలో ఇంకా 6 వికెట్లు మిగిలి ఉన్నాయి. ఈ స్థితిలో భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరుత్సాహపడి, మ్యాచ్ తమ చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయిందని భావించారు. వారి శరీర భాషలోనే ఆ ఓటమి భయం స్పష్టంగా కనిపించింది.

స్టంప్ మైక్లో రికార్డయిన గిల్ మంత్రం
అలాంటి కీలక స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన సహచర ఆటగాళ్లను చూసి హిందీలో ఉత్సాహంగా మాట్లాడాడు. అతని మాటలు స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డయినప్పుడు స్టేడియం అంతా వినిపించాయి. "రండి, కుర్రాళ్ళూ.. ఇంకో గంట మాత్రమే కష్టపడదాం, ఆ తర్వాత అందరం కలిసి విశ్రాంతి తీసుకుందాం" ("Come on, boys. Ek ghanta aur zor lagayenge, uske baad sab mil ke aaraam karenge") అని అతను అన్నాడు. ఈ ఒక్క మాట జట్టుకు కొత్త ప్రాణం పోసింది.
తక్షణమే మారిన ఆట
శుభ్మన్ గిల్ అలా అన్న తర్వాతి కొన్ని నిమిషాల్లోనే ఆటలో అద్భుతం జరిగింది. అంతకుముందు వికెట్లు తీయడానికి కష్టపడ్డ భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. ప్రసిద్ కృష్ణ వేసిన బంతికి కొత్తగా క్రీజులోకి వచ్చిన జాకబ్ బెథెల్ ఔట్ అయ్యాడు. ఇది ఇంగ్లండ్ శిబిరంలో కాస్త ఆందోళన రేకెత్తించింది. ఆ తర్వాతి ఓవర్లోనే భారత బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారిన, సెంచరీతో రాణించిన జో రూట్ను కూడా ప్రసిద్ కృష్ణే ఔట్ చేసి ఇంగ్లండ్ జట్టును తీవ్ర షాక్కు గురిచేశాడు. వెంటవెంటనే వికెట్లు పడటంతో ఇంగ్లండ్ జట్టు 337 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి అనూహ్యంగా తడబడింది. విజయం ఖాయమైందని స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లండ్ అభిమానులకు ఇది పెద్ద షాక్గా మారింది. ఈ కీలక వికెట్లతో భారత జట్టుకు ఒక్కసారిగా కొత్త ఉత్సాహం, గెలుపుపై కొత్త ఆశలు చిగురించాయి.
ఈ రోజే చివరి రోజు..
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వాతావరణం అనుకూలించకపోవడం, వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేయబడింది. అప్పటికి ఇంగ్లండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయం సాధించడానికి ఇంకా కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం. అదే సమయంలో ఈ టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసుకోవడానికి టీమిండియాకు కేవలం 4 వికెట్లు మాత్రమే కావాలి. దీంతో, పోటీ చివరి రోజైన ఈరోజు ఆటలో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుందని, హోరాహోరీ పోరు ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.