ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా సత్తాచాటుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు మన స్పిన్నర్లు చుక్కులు చూపిస్తున్నారు. తొలి రోజు ఆటలో రెండో సెషన్ ముగిసేసరికి ఇంగ్లండ్ 55 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అయితే ఇంగ్లండ్కు శుభారంభం దక్కింది. తొలి వికెట్కు బెన్ డకెట్ (27; 58 బంతుల్లో), జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రాలే కాస్త దూకుడుగా ఆడితే, డకెట్ సంయమనంతో పరుగులు చేశాడు. వీరిద్దరు కుదురుకోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కానీ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది.

కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డకెట్ భారీషాట్కు యత్నించాడు. ఆఫ్సైడ్ వైపు బంతి గాల్లోకి లేచింది. వెంటనే శుభ్మన్ గిల్ కవర్ నుంచి కుడివైపు వేగంగా పరిగెత్తాడు. బంతిని గమనిస్తూనే పరిగెత్తుతూ క్యాచ్ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాదాపు 20-25 యార్డ్స్ దూరం గిల్ వెనక్కి పరిగెత్తాడని వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అయితే గిల్ పట్టిన అద్భుత క్యాచ్ను చూశాక 2023 వన్డే వరల్డ్ కప్ భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ గుర్తొచ్చిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన షాట్ను ట్రేవిస్ హెడ్ ఇదే రీతిలో క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ గమనం మారిపోయింది. డిఫెన్స్ మోడ్లో టీమిండియా వెళ్లింది. ఆ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
''గిల్ అందుకున్నది అంత సులువైన క్యాచ్ కాదు. వెనక్కి పరిగెత్తుతూ క్యాచ్ పట్టాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ ఔటైన తీరు గుర్తొచ్చింది. రోహిత్ ఇదే తరహాలో ట్రావిస్ హెడ్ చేతికి చిక్కాడు. టీమిండియా ఆటగాళ్లు హగ్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. అది ఎంత కష్టతరమైన క్యాచ్ అనేది వాళ్లకి తెలుసు. గిల్ ఆజానుబాహుడు అవ్వడంతో దాన్ని అందుకోగలిగాడు. అద్భుతమైన నైపుణ్యం. గొప్ప క్రికెటర్'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.