వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్మన్ గిల్ గాయంతో ఇవాళ ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైంది. కానీ బ్యాటింగ్ను కొనసాగించాడు. గాయం తీవ్రత దృష్ట్యా సోమవారం ఆటలో గిల్ బరిలోకి దిగట్లేదని బీసీసీఐ ప్రకటించింది. గిల్ స్థానంలో సర్ఫరాజ్ఖాన్ ఫీల్డింగ్ చేయనున్నట్లు తెలిపింది. స్లిప్లో అద్భుతంగా క్యాచ్లు అందుకునే గిల్ ఫీల్డింగ్లో లేకపోవడం భారత్కు ప్రతికూలాంశమే.
స్లిప్ క్యాచ్లను జాగ్రత్తగా ఒడిసిపట్టడంలో గిల్ దిట్ట. అంతేగాక అతడి ఎత్తు క్యాచ్లను సులువుగా అందుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. ఎత్తులో వచ్చినా, బంతి ముందుకు పడినా గిల్ గాల్లోకి ఎగురుతూ, డైవ్ చేస్తూ అందుకోగలడు. అయితే టీమిండియా బ్యాటింగ్ అనంతరం అతడు దూరమవ్వడం కాస్త సంతోషించదగ్గ విషయం. భారత్ రెండో ఇన్నింగ్స్ పూర్తికాకముందే గిల్ దూరమైతే అది కోలుకోలేని దెబ్బగా మారేది.

గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన గిల్ ఎట్టకేలకు ఫామ్లో వచ్చిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో గిల్ 147 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి పోరాటంతోనే టీమిండియా 255 పరుగులు చేయగలిగింది. ఆదివారం ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ ఓపెనర్లు ఔటైనా గిల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి మూడో వికెట్కు 81 పరుగులు జోడించాడు. అంతేగాక అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో)తో కలిసి అయిదో వికెట్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కాగా, ఓవర్నైట్ స్కోరు 67/1తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. రెహాన్ అహ్మద్ (23; 31 బంతుల్లో), ఒలీ పోప్ (18; 16 బంతుల్లో) వికెట్లను కోల్పోయినప్పటికీ లక్ష్యాన్ని కరిగిస్తూ వస్తోంది. 29 ఓవర్లకు 141/3తో నిలిచింది. ఇంగ్లండ్ విజయానికి 257 పరుగులు అవసరం. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలే (54*; 93 బంతుల్లో), జో రూట్ (9*, 5 బంతుల్లో) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 255 పరుగులకు ఆలౌటైంది.