టీమిండియాకు బిగ్ షాక్. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని సమాచారం. వైజాగ్ టెస్టు అనంతరం టీమిండియా ఆటగాళ్ల లగేజ్ను మూడో టెస్టు జరిగే రాజ్కోట్కు తరలించారు. కానీ శ్రేయస్ అయ్యర్ లగేజ్ను మాత్రం తన ఇంటికి పంపించారని సమాచారం.
''30 బంతులు కంటే ఎక్కువగా ఆడిన సందర్భాల్లో వెన్నునొప్పి వస్తుందని, ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన గజ్జల్లో నొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా, మేనేజ్మెంట్, వైద్య సిబ్బందికి తెలిపాడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడికి కొన్ని వారాలు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలో అతడు ఎన్సీఏకి వెళ్తాడు'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటికీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం వారిద్దరు ఎన్సీఏలో కోలుకుంటున్నారు. రాజ్కోట్లో జరిగే మూడో టెస్టుకు అందుబాటులో వస్తారని ఆశిస్తున్నా, దానిపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ కూడా దూరమవ్వడం భారత్కు ప్రతికూలాంశమే.
శ్రేయస్ వ్యక్తిగతంగా భారీ స్కోర్లు సాధించనప్పటికీ జట్టులో విలువైన పాత్ర పోషిస్తున్నాడు. స్టన్నింగ్ క్యాచ్లు, రనౌట్లతో పాటు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు. ప్రస్తుత యువ బ్యాటింగ్ లైనప్లో రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యర్కే కాస్త అనుభవం ఎక్కువ ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాగా, అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.