IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లో జరుగుతోంది. మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ కలిసి తొలి వికెట్కు 166 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్ల ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే బౌలర్గా శార్దూల్ ఠాకూర్ సేవలను భారత జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత శార్దూల్ ఠాకూర్ కీలక ప్రకటన చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ వైపు బంతిని నెడుతూ.. బౌలింగ్ ఇవ్వడం తన పని కాదని శార్దూల్ ఠాకూర్ అన్నాడు.
శార్దూల్ ఠాకూర్ ఏమన్నాడంటే?
భారత బౌలర్ల పేలవ ప్రదర్శనపై శార్దూల్ను ప్రశ్నించగా.. "బౌలింగ్ ఇవ్వడం కెప్టెన్ నిర్ణయం. అది నా చేతిలో లేదు. ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. నేను ఈ రోజు మరో రెండు ఓవర్లు ఎక్కువగా వేయగలిగేవాడిని, కానీ అది కెప్టెన్ నిర్ణయం. ఫామ్ను కనుగొనడం కష్టం. కానీ నేను నా అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాను. మేము చేసిన పరుగులు మంచి ప్రయత్నం. బంతి చాలా వేగంగా కదులుతోంది" అని శార్దూల్ ఠాకూర్ అన్నాడు. అయితే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయగలిగే వారని ఆయన అంగీకరించారు. "కొత్త బంతితో మేము మెరుగైన ప్రదర్శన చేయగలిగే వాళ్ళం. పరుగులు వస్తూనే ఉన్నాయి. బౌలర్లకు ఇది కష్టం కాదు. మేము సహనంతో ఉండగలిగే వాళ్ళం. ఏ బంతులపై స్థిరంగా ఉండాలో మేము అంచనా వేయాలి" అని శార్దూల్ పేర్కొన్నాడు.

రిషబ్ పంత్ గాయంపై కూడా శార్దూల్ ఠాకూర్ మాట్లాడాడు. "ఈ రోజు రిషబ్ పంత్ బస్సులో రాలేదు ఎందుకంటే అతను ఆస్పత్రిలో ఉన్నాడు. మేము వార్మప్ చేస్తున్నప్పుడు పంత్ మైదానంలో లేడు. అతని కాలికి గాయమైందనే సంగతి ఇదివరకే తెలిసిందే." అని శార్దూర్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
భారత్ మొదట బ్యాటింగ్ చేసి 114.1 ఓవర్లలో 358 పరుగులు చేసింది. దానికి సమాధానంగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ అర్ధశతకాలు సాధించారు. జాక్ క్రాలీ 113 బంతుల్లో 84 పరుగులు చేయగా.. బెన్ డకెట్ 100 బంతుల్లో 94 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకబడి ఉంది. మూడో రోజు భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకోవాలి. లేకపోతే మ్యాచ్ భారత్ చేజారిపోతుంది.