
లీడ్స్: ఐదు మ్యాచుల టెస్ట్ సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 132.2 ఓవర్లు ఆడి 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లలో క్రెయిగ్ ఓవర్టన్ (32)ను మొహ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆంగ్లేయులకు 354 పరుగుల ఆధిక్యం దక్కింది. షమీ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఈ మ్యాచులో ఓటమి పాలవ్వకుండా ఉండాలంటే అద్భుతమే జరగాలి. ఇంతకన్నా ఎక్కువ స్కోరైనా చేయాలి. లేదంటే మూడు రోజుల పాటు ఆలౌట్ అవ్వకుండా ఆడాలి.
ఓవర్నైట్ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ (0) అజేయంగా నిలిచాడు.
గురువారం అయిన రెండో రోజు ఆటముగిసేసరికి రూట్ సేన తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రేగ్ ఓవర్టన్ (24), ఓలి రాబిన్సన్ (0) నాటౌట్గా నిలిచారు. కెప్టెన్ జో రూట్ (121; 165 బంతుల్లో 14x4) సెంచరీ బాదాడు. డేవిడ్ మలన్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 345 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.
ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 23 బంతుల్లో 3 పరుగులు, లోకేష్ రాహుల్ 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. భారత్ ఇంకా 345 పరుగులు వెనకపడిఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (19), అజింక్య రహానే (18)లు మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లీష్ గడ్డపై భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.
టీమిండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం లీడ్స్లో ఆకాశం మేఘావృతమైంది. అక్కడ ఉదయం చిరుజల్లులు కురిశాయి. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం ఆగింది. దీంతో త్వరగానే భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును ఆలౌట్ చేశారు. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో జేమ్స్ అండర్సన్ను తట్టుకొని భారత్ నిలబడటం కష్టమే. భారత ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మల ప్రదర్శనపైనే భారత్ ఓటమి ఆధారపడివుంది.