ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్ సెన్సేషనల్ క్యాచ్ అందుకున్నాడు. వెనక్కి పరిగెత్తుతూ డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. గిల్ అద్భుత ఫీల్డింగ్తో ఇంగ్లండ్ 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బెన్ డకెట్ (27; 58 బంతుల్లో) భారీ షాట్కు యత్నించాడు. అది బ్యాటుకు సరిగా కనెక్ట్ అవ్వలేదు. ఆఫ్సైడ్ వైపు బంతి గాల్లోకి లేచింది. వెంటనే గిల్ కవర్ నుంచి కుడివైపు వేగంగా పరిగెత్తాడు. బంతిని గమనిస్తూనే పరిగెత్తుతూ క్యాచ్ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాదాపు 20-25 యార్డ్స్ దూరం గిల్ వెనక్కి పరిగెత్తాడని వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొన్నాడు.

కాగా, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. డకెట్తో కలిసి జాక్ క్రాలే (61*; 71 బంతుల్లో) ఇన్నింగ్స్ ఆరంభించారు. డకెట్ నిదానంగా ఆడగా, క్రాలే కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కోల్పోవకుండా బుమ్రా, సిరాజ్ను వీరిద్దరు జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. బుమ్రా విసిరిన బంతులు కొన్ని బ్యాటుకు ఎడ్జ్ తీసుకున్నా ఫీల్డర్ల వరకు అవి చేరలేదు. దీంతో కుల్దీప్కు రోహిత్ బంతిని అందించాడు. తన తొలి ఓవర్లోనే డకెట్ను కుల్దీప్ ఔట్ చేశాడు. డాట్స్ ఎక్కువగా ఆడిన డకెట్ గేర్ మార్చుదామనుకొని పెవిలియన్కు చేరాడు.
లంచ్ విరామానికి 25.3 ఓవర్లకు ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఒలీ పోప్ (11; 24 బంతుల్లో) ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. కాగా, ఇప్పటికే సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న భారత్ ఆఖరి టెస్టు తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. రజత్ పటిదార్, ఆకాశ్ దీప్ను తప్పించింది. గాయం కారణంగా రజత్ చివరి టెస్టుకు అందుబాటులో లేడని తెలిపింది. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్తో దేవదత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా తిరిగొచ్చాడు.