రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. విజయానికి టీమిండియాకు 61 పరుగులు, ఇంగ్లండ్కు అయిదు వికెట్లు అవసరం. ఈ సమీకరణాన్ని చూస్తే భారత్ ఫేవరేట్గానే కనిపిస్తోంది. కానీ రాంచీ వికెట్ అంత సులువుగాలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్లు గిరగిర తిరిగే బంతుల్ని సంధిస్తూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో విజయానికి తక్కువ పరుగులు అవసరమైనప్పటికీ భారత అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో గిల్ (22*), ధ్రువ్ జురెల్ (8*) ఉన్నారు.
అయితే ఓ స్థితిలో టీమిండియా 84/0తో లక్ష్యం దిశగా సాఫీగా దూసుకెళ్లింది. కానీ యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) తొందరపాటు షాట్తో ఔటయ్యాడు. ఇవాళ ఆటలో జో రూట్ను ఎదుర్కోవడం జైస్వాల్కు అదే తొలిసారి. మొదటి బంతికే ప్రతిదాడి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి షాట్ ఆడాడు. అయితే అది బ్యాటుకు సరిగా కనెక్ట్ అవ్వలేదు. మరోవైపు అండర్సన్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకోవడంతో జైస్వాల్ ఔటయ్యాడు.

నాన్స్ట్రైకింగ్లో ఉన్న రోహిత్ శర్మ ఇదంతా గమనించి.. జైస్వాల్ ఔటైన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంత అవసరం ఏమొచ్చిందంటూ.. సింబాలిక్గా సైగలు చేశాడు. ఆ తర్వాత రోహిత్ బాధతో తల దించుకున్నాడు. ఆదివారం ఆటలో ఆఖరి ఓవర్లో కూడా జో రూట్ బౌలింగ్లో జైస్వాల్ దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాడు. కానీ రోహిత్ దానికి ఒప్పుకోలేదు. మిగిలిన రెండు బంతుల్ని డిఫెండ్ చేయమని సూచించాడు. ఎలా డిఫెండ్ చేయాలో కూడా బ్యాటుతో రోహిత్ చూపించాడు.
దానికి తగ్గట్లుగానే జైస్వాల్ ఢిపెండ్ చేశాడు. దీంతో రోహిత్ సంతోషంగా జైస్వాల్తో కలిసి మైదానాన్ని వీడాడు. దీని గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ స్పందిస్తూ.. కొడుకుని తండ్రి సంరక్షించుకున్నట్లుగా జైస్వాల్ను రోహిత్ కాపాడుకుంటున్నాడని అన్నాడు. ఆదివారం ఆట చివరిలో ఎలా డిఫెండ్ చేయాలో జైస్వాల్కు రోహిత్ దిశానిర్దేశం చేశాడని, ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉందని స్వాన్ పేర్కొన్నాడు.