అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఆఖరి మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి మ్యాచ్లోనూ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో ప్రతి టెస్టు ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కూడా గెలుపుపై కన్నేసింది. సిరీస్ చేజారినప్పటికీ పర్యటనను 2-3తో ముగించాలని ఇంగ్లిష్ టీమ్ భావిస్తోంది. అంతేగాక ధర్మశాల పరిస్థితులు భారత్ కంటే ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చలితో కూడిన వాతావరణం, పిచ్ సీమ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో తమ స్వదేశ అనుభూతిని ఇంగ్లండ్ ఆటగాళ్లు పొందే ఛాన్స్ ఉంది.

అయితే భారత సారథి రోహిత్ శర్మ ఇవాళ ధర్మశాలకు చేరుకున్నాడు. హెలికాప్టర్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న రోహిత్ ఇవాళ తిరిగి టీమిండియాతో కలిశాడు. గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1న ప్రారంభమైన ఈ వేడుకలకు రోహిత్ హాజరైన విషయం తెలిసిందే. కాగా, ధర్మశాల టెస్టు రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోకు ఎంతో స్పెషల్ కానుంది. వీరిద్దరు తమ కెరీర్లో ధర్మశాల వేదికగా 100వ టెస్టు ఆడనుండటం విశేషం.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , కేఎస్ భరత్ , దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్: జాక్ క్రాలే , బెన్ డకెట్ , ఒలీ పోప్ , జో రూట్ , జానీ బెయిర్స్టో , బెన్ స్టోక్స్ (కెప్టెన్) , బెన్ ఫోక్స్ , టామ్ హార్ట్లీ, ఒలీ రాబిన్సన్ , షోయబ్ బషీర్ , జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్ , డేనియల్ లారెన్స్ , గుస్ అట్కిన్సన్