వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగు రోజు ఆట ప్రారంభంలోనే భారత్ బౌలర్లు వికెట్ల వేట మొదలుపెట్టారు. ఓవర్నైట్ స్కోరు 67/1తో సోమవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ 154 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్మన్ రెహాన్ అహ్మద్ (23; 31 బంతుల్లో) అక్షర్ పటేల్ బోల్తాకొట్టించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్ (18; 16 బంతుల్లో)తో కలిసి జాక్ క్రాలే (60*; 103 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్ అద్భుతమైన క్యాచ్తో పోప్ వెనుదిరగాల్సి వచ్చింది. అశ్విన్ వేసిన బంతిని పోప్ షాట్కు యత్నించగా, వేగంగా స్లిప్ వైపునకు దూసుకెళ్లింది. రోహిత్ వెంటనే స్పందించి ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ను గొప్పగా అందుకున్నాడు. రెప్పపాటులో వచ్చిన బాల్ను హిట్మ్యాన్ అందుకున్న తీరు అమోఘం.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్ (16; 10 బంతుల్లో)ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. రూట్ చెత్త షాట్కు ట్రై చూసి అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. అయితే రూట్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ పర్యటనకు వచ్చిన బ్యాటర్లలో టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన అయిదో ప్లేయర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు క్లైయివ్ లాయిడ్ (1359 పరుగులు), కుక్ (1235 పరుగులు), గ్రీనిడ్జ్ (1042 పరుగులు), మాథ్యూ హెడెన్ (1027 పరుగులు) ఈ ఘనత సాధించారు.
కాగా, తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. 104 పరుగులతో సత్తాచాటాడు. టామ్ హర్ట్లీ నాలుగు, రెహాన్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలే, జానీ బెయిర్స్టో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి మరో 233 పరుగులు అవసరం.