
లీడ్స్: హెడింగ్లీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రెండో సెషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. రోహిత్ శర్మ (59; 152 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకంతో కొనసాగుతుండగా.. చేతేశ్వర్ పుజారా (40; 72 బంతుల్లో 8x4) క్రీజులో కుదురుకున్నాడు. దాంతో భారత్ రెండో సెసన్ పూర్తయ్యేసరికి ఒక వికెట్ కోల్పోయి 112 పరుగులు చేసింది. వీరిద్దరూ ఈ సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడి 78 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ కన్నా భారత్ 242 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భోజన విరామ సమయానికి భారత్ 34/1తో నిలిచిన సంగతి తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్(8) ఓవర్టన్ బౌలింగ్లో స్లిప్లో బెయిర్స్టో చేతికి చిక్కాడు.
ఓవర్నైట్ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లేయర్ ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ (0) అజేయంగా నిలిచాడు. జో రూట్ (121; 165 బంతుల్లో 14x4) సెంచరీ చేయగా.. డేవిడ్ మలన్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 345 పరుగుల ఆధిక్యం దక్కింది.
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించారు. ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే 19 ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన రాహుల్ చివరికి క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్లో స్లిప్లో జానీ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రాహుల్ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ ఔట్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (25) క్రీజులో ఉన్నాడు. అప్పటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు భారత్ ఇంకా 320 పరుగులు వెనకబడి ఉంది.
రెండో సెషన్లో రోహిత్ శర్మకు జతగా.. చేతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడినా.. పుజారా ఈ సిరీసులోనే వేగంగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. మరోవైపు రోహిత్ కూడా వేగం పుంజుకున్నాడు. రోహిత్ కూడా బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు పుజారా కూడా హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో భారత్ రెండో సెసన్ పూర్తయ్యేసరికి 112/1తో నిలిచింది. వీరిద్దరూ ఈ సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడి 78 పరుగులు జోడించారు. రెండో సెషన్ పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ కన్నా భారత్ 242 పరుగుల వెనుకంజలో ఉంది.