ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో రోహిత్ బరిలోకి దిగట్లేదని బీసీసీఐ తెలిపింది. గాయం తీవ్రత గురించి వివరాలు వెల్లడించలేదు. రోహిత్ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు.
మరోవైపు బుమ్రా కెప్టెన్సీలో తన మార్క్ను చూపిస్తున్నాడు. కొత్తబంతిని రవిచంద్రన్ అశ్విన్తో కలిసి పంచుకోవాలనుకున్న వ్యూహం ఫలించింది. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తన తొలి ఓవర్లోనే బెన్ డకెట్ (2; 5 బంతుల్లో) క్లీన్బౌల్డ్ చేశాడు. కాసేపటికే జాక్ క్రాలే (1; 16 బంతుల్లో) బోల్తాకొట్టించాడు. అశ్విన్ బౌలింగ్లో షాట్కు యత్నించిన క్రాలే లెగ్ స్లిప్లో సర్ఫరాజ్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

కాగా, ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 124.1 ఓవర్లకు 477 పరుగులు చేసి ఆలౌటైంది. 259 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే సాధించింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో కుల్దీప్ (30; 69 బంతుల్లో) షాట్కు యత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా (20; 64 బంతుల్లో) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు.
టీమిండియా బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (110; 150 బంతుల్లో), రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. దేవదత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్ ఒక్క వికెట్ తీశాడు.