ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరగనున్న అయిదో టెస్టులో భారత జట్టును సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నడిపించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తన కెరీర్లో 100 టెస్టుల మైలురాయికి చేరుకుంటున్న అశ్విన్కు గౌరవంగా ఇది చేయాలని పేర్కొన్నాడు. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నట్లు గవాస్కర్ తెలిపాడు.
భారత్ తరఫున 98 టెస్టులు ఆడిన అశ్విన్ ధర్శశాలలో జరగనున్న మ్యాచ్ 99వ టెస్టు అవ్వనుంది. ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ పేర్కొన్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మరోసారి ఈ విషయం గురించి మాట్లాడాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు.

''నాలుగో టెస్టులో సోమవారం భారత్ విజయం సాధిస్తుంది. ఇక ధర్మశాలకు బయల్దేరండి. మైదానంలో టీమిండియాను నువ్వు నడిపించడానికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నా. భారత క్రికెట్కు నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం దక్కాలి'' అని అశ్విన్తో గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ వ్యాఖ్యలతో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఏకీభవించాడు.
దానికి రవిచంద్రన్ అశ్విన్ బదులిస్తూ.. ''సన్నీ బాయ్ మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. చాలా థ్యాంక్స్. అయితే ఈ అంచనాలను నేను ఎప్పుడో దాటేశానుకుంటా. నిజం చెప్పాలంటే.. టీమిండియాతో కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. జట్టుతో ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను'' అని పేర్కొన్నాడు. కెప్టెన్సీపై ఆశలు లేవని ఇలా పరోక్షంగా యాష్ వెల్లడించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు. అశ్విన్ (5/51), కుల్దీప్ యాదవ్ (4/22) ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.