దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియానే గెలిచిందని భారత ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఇంగ్లండ్ టూర్ తనకు బాగుందని, అయితే ఇదే ఉత్తమమని మాత్రం తాను చెప్పలేనన్నాడు. తనలోని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయట పడాల్సి ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి భయంతో భారత ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. నాలుగు టెస్ట్లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్లో ఉంది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ మొత్తంగా ఐదు టెస్టులు ఆడాలి. కరోనా వైరస్ మహమ్మారి భయంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ అర్ధంతరంగా రద్దయింది. ఇప్పుడు ఆ చివరి టెస్ట్ జరుగుతుందా లేదా.. జరిగితే ఏకైక టెస్ట్లా జరుగుతుందా లేక ఈ సిరీస్లో భాగంగా జరుగుతుందా అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే దీనిపై తాజాగా ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్లో నిజమైన విజేత ఇండియానే అని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే తుది ఫలితం మాత్రం ఈసీబీ బీసీసీఐ, ఐసీసీ తీసుకుంటాయని చెప్పాడు.
రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్నాడు. అడిదాస్ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పాల్గొన్నాడు. ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్ క్యాంపెయిన్లో భాగంగా రోహిత్ మాట్లాడుతూ.. 'నా దృష్టిలో ఈ సిరీస్ మేము గెలిచాము. చివరి టెస్ట్ సంగతేంటో నాకు తెలియదు. దానిని ఏకైక టెస్ట్లాగా ఆడతామా.. దాంతోనే సిరీస్ నిర్ణయిస్తారా తెలియదు. దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు' అని అన్నాడు. ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్ రోహిత్ శర్మనే. సిరీస్లో రోహిత్ 52 సగటుతో 368 రన్స్ చేశాడు. అంతేకాదు ఇదే సిరీస్లో విదేశీ టెస్టుల్లో తన తొలి సెంచరీ కూడా చేయడం విశేషం.
'టెస్టు కెరీర్లో ప్రస్తుతం నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కానీ ఇంగ్లండ్ పర్యటనే నా అత్యుత్తమ సిరీస్ కాదు. నాలోని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రావాల్సి ఉంది. సౌతాంప్టన్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్నకు ముందు ఉన్న సమయాన్ని ఎలాంటి టెక్నిక్, దృక్పథంతో ఉండాలి అనే అంశాల కోసం వినియోగించా. ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా' అని రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లండ్తో రద్దయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. ఆ సమయంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ల కోసం అక్కడికి వెళ్లాల్సి ఉంది. అప్పుడే అదనంగా ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. ఒక టెస్టుకు బదులుగా అదనంగా రెండు టీ20లు ఆడే అవకాశాలు ఉన్నాయి.