ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో రోహిత్ శర్మ (102*; 160 బంతుల్లో), శుభ్మన్ గిల్ (101*; 142 బంతుల్లో) శతకాలతో కదం తొక్కారు. ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగుతున్నారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. వీరిద్దరు పరుగుల మోత మోగించడంతో ఇంగ్లండ్పై భారత్ 46 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
135/1 ఓవర్నైట్ స్కోరు ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా మరో వికెట్ కోల్పోకుండా తొలి సెషన్ ముగించింది. వన్డే తరహాలో 30 ఓవర్లలో 129 పరుగులు చేసింది. లంచ్ విరామానికి 60 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. అయితే సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఈ క్రమంతో పలు రికార్డులు బద్దలుకొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఓపెనర్గా రోహిత్ శర్మ 43 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో డేవిడ్ వార్నర్ (49), సచిన్ టెండూల్కర్ (45) ఉన్నారు. క్రిస్ గేల్ (42), సనత్ జయసూర్య (41), మాథ్యూ హేడెన్ (40) హిట్మ్యాన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
అంతేగాక రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. 2019 నుంచి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్గా రోహిత్ నిలిచాడు. 2019 నుంచి రోహిత్ తొమ్మిది సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్గా సునీల్ గవాస్కర్తో రోహిత్ శర్శ సమంగా నిలిచాడు. వీరిద్దరు ఇంగ్లిష్ జట్టుపై నాలుగు సెంచరీలు సాధించారు.
అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్తో రోహిత్ సమంగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (80), రాహుల్ ద్రవిడ్ (48), రోహిత్ శర్మ (48) టాప్-4లో ఉన్నారు. కాగా, 2021 నుంచి భారత్ తరఫున అత్యధిక శతకాలు బాదిన ఆటగాడు హిట్మ్యనే. ఆరు సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో శుభ్మన్ గిల్ (4) ఉన్నాడు.