
లండన్: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. తొలి సెషన్లో 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత వర్షం పడటంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. అదే సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), రోహిత్ శర్మ (35)లు క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్నా.. భారత ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రస్తుతం అక్కడ వర్షం తగ్గింది. రెండో సెషన్ 6:20 pm to 8:45 pm, మూడో సెషన్ 9:05 pm to 11:20 pm మధ్య జరగనుంది. అన్ని అనుకూలిస్తే.. మ్యాచ్ 12 గంటలవరకు సాగనుంది. మొదటి సెషన్లో కోల్పోయిన ఓవర్లను కవర్ చేయనున్నారు.
లండన్లో ఉదయం నుంచి వాతావరణ ప్రశాంతంగానే ఉండటంతో రెండో టెస్ట్ మ్యాచ్ సవ్యంగానే సాగుతుందని అంతా ఆశించారు. సరిగ్గా టాస్కు ముందే చినుకులు మొదలవ్వడంతో లార్డ్స్ మైదానం సిబ్బంది కవర్లు కప్పేశారు. కాసేపటికి వర్షం ఆగడంతో టాస్ 20 నిముషాలు ఆలస్యంగా పడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. దాంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వాతావరణం మేఘావృతమై పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్నా.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా లోకేష్ రాహుల్ డిఫెన్స్కే పరిమితం అయ్యాడు. చెత్త షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకున్నాడు. అయితే క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ.. సామ్ కరన్ను టార్గెట్ చేసి ఆడాడు. అతడు వేసిన ఓ ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. ఆపై కూడా అతడిని వదలలేదు. దాంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. ఆ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), రోహిత్ శర్మ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమవుతున్న జాక్ క్రాలీ, డేనియల్ లారెన్స్ స్థానంలో హసీబ్ హమీద్, మొయిన్ అలీ జట్టులోకి వచ్చారు. గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయిన సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బదులు మార్క్ వుడ్ ఆడనున్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. గాయపడిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. దీంతో స్పెసలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు నిరాశే ఎదురైంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.